మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ప్రముఖ క్షేత్రాలతో పాటుఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసేందుకు పోటీపడ్డారు. ఎటుచూసినా దర్శనానికి బారులుదీరిన భక్తుల సందడి కనిపించగా.. శంభోశంకర, హరహర మహాదేవ అంటూ భక్తుల నామస్మరణ, భజనలు, భక్తిపాటలు మార్మోగాయి. భక్తులు ఉదయం ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేశారు. పలు ఆలయాల్లో పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం నిర్వహించగా భక్తులు కనులారా వీక్షించారు.
చెర్వుగట్టు, పానగల్, పిల్లలమర్రి, వాడపల్లి, ఏలేశ్వరం, మేళ్లచెర్వులోని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. మిర్యాలగూడ, వాడపల్లి, అడవిదేవులపల్లిలోని శివాలయాలను శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి దర్శించుకున్నారు. సూర్యాపేట, పిల్లలమర్రిలోని ఆలయాల్లో మంత్రి జగదీశ్రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
ఓంకార నాదాలు, శివపంచాక్షరి నామస్మరణలతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముక్కంటి ఆలయాలు మార్మోగాయి. మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు శైవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. శివ లింగాలకు అభిషేకాలు నిర్వహించారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులకు పలు చోట్ల పండ్లు పంచిపెట్టారు. అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.
రాత్రి శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ప్రధాన ఆలయాలైన వాడపల్లి, మేళ్లచెర్వు, పిల్లలమర్రి, పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు సాయంత్రం విరమించారు. రాత్రి జాగారం చేశారు.