ఒకనాడు సాగునీటి జాడ లేక, చేసేందుకు పనులు దొరక్క వలసలకు వరుస కట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్వరాష్ట్రంలో సస్యశ్యామలం అవుతున్నది. బీడు భూముల్లో జల సవ్వడులు వినిపిస్తూ ఉపాధి ముఖచిత్రాన్ని మార్చివేసింది. మిషన్ కాకతీయతో నిండు కుండను తలపిస్తున్న చెరువులు, కృష్ణా, గోదావరి, మూసీ జలాలతో పారుతున్న కాల్వలు.. పెరిగిన భూగర్భ జలాలతో రెండింతల భూమి వినియోగంలోకి వచ్చింది. సీఎం కేసీర్ సర్కారు కృషి, సాయంతో వ్యవసాయం పండుగలా మారింది. మునుపెన్నడూ లేనట్టు సాగర్ ఎడమకాల్వకు డెడ్ స్టోరేజీలోనూ నీరందింది. కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాను కరువు కోరల నుంచి బయట పడేశాయి. యాదాద్రి భువనగిరి జిలాల్లోనూ సాగు జోరు మీదున్నది. దాంతో రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకోవడంతోపాటు వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్, లారీ డ్రైవర్లు, హమాలీలు, హార్వెస్టర్ యజమానులు, సమభావన సంఘాల సభ్యులకు చేతినిండా పని దొరుకుతున్నది. అనుబంధ రంగాలూ బలోపేతం అవుతున్నాయి ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా భౌగోళికంగా 35.09లక్షల ఎకరాలు భూమి ఉండగా, 2014-15లో 13.12 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఆ విస్తీర్ణం ప్రస్తుతం 22.58 ఎకరాలకు చేరడం విశేషం.
– నల్లగొండ, సెప్టెంబర్ 23
నల్లగొండ/ సూర్యాపేట/ యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 23 : నిత్యం జల సవ్వడులు.. పారుతున్న కాల్వలు.. పెరిగిన భూగర్భ జలాలు.. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ దశాబ్ది కాలంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటా లక్ష ఎకరాల చొప్పున సాగు పెరుగడంతో వ్యవసాయ కూలీలకు నిత్యం విరివిగా పని దొరుకుతున్నది. ప్రధానంగా వరి, పత్తి ఇతర పంటల సాగు పెరుగడంతో విత్తనం నుంచి కోత వరకు పనులు చేపట్టే వ్యవసాయ కూలీలు, ఆ ఉత్పత్తులను లోడింగ్, అన్ చేసే హమాలీలు, వాటిని మార్కెట్ వరకు తీసుకెళ్లే లారీల యాజమాన్యం, సాగులో ప్రధాన పాత్ర పోషించే ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వతోపాటు లో లెవల్, హైలెవల్ కాల్వలు, మూసీ, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా సాగు జలాలు రావడంతోపాటు సాధారణానికి మించి కురుస్తున్న వర్షాల మూలంగా ఈ పదేండ్ల నుంచి కాలం పచ్చగా సాగుతున్నది.
సాగు పనుల్లో రైతులు, కూలీలు బిజీ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పదేండ్లలో నీటి వనరులు పెరుగడంతో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. నల్లగొండలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వతోపాటు లో లెవల్, హైలెవల్ కాల్వల ద్వారా.. సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మూసీ, కాళేశ్వరం జలాలు రావడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భౌగోళికంగా 35.09లక్షల ఎకరాల భూములు ఉండగా.. 2014-15లో 13.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాగర్ నీటి కేటాయింపులు న్యాయంగా రావడం, కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు అందడంతో ఉమ్మడి జిల్లా అంతా సస్యశ్యామలంగా మారింది. సాగు విస్తీర్ణం పెరుగడంతో కూలీల కొరతతో వ్యవసాయంలో యంత్రాల పాత్ర పెరిగింది.
నిత్యం పనులే..
ఇన్నాళ్లు నీటి వనరులు లేకపోవడంతో వానకాలంలో మాత్రమే వర్షాధార పంటలు వేసేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు పంటలకు నీళ్లు రావడంతో బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. విత్తనం విత్తే సమయంలో కూలీలు, పంట కొనే సమయంలో హమాలీలు, మార్కెట్ తరలించే సమయంలో లారీ యాజమాన్యానికి పని దొరుకుతుండటంతో ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే వస్తున్నది. లారీ డ్రైవర్లు, సమభావన సంఘాల సభ్యులు, హమాలీలకు పుష్కలంగా పని దొరుకుతున్న నేపథ్యంలో గ్రామాలు నిత్యం పనుల్లోనే నిమగ్నమవుతున్నాయి.
యాదాద్రి జిల్లాలో గోదారమ్మ పరవళ్లు
యాదాద్రి భువనగిరి జిల్లాలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలు జిల్లాను తాకాయి. ఇప్పటికే బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా యాదగిరిగుట్ట నర్సన్న పాదాలను గోదావరి జలాలు ముద్దాడాయి. ఆలేరు నియోజకవర్గంలోని భూములను తడుపుతున్నాయి. 2020లోనే కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి ప్రధాన కాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలారామారం మండలాలకు సాగునీరు అందింది. ఈ కాల్వ ద్వారా రెండు మండలాల్లో 1,285 ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఈ నెల 11న అందుబాటులోకి వచ్చిన మన్నెవారి తుర్కపల్లి ప్రధాన కాల్వతో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని 868 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతున్నది. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలోని 733 చెరువుల్లో పూడిక తీశారు. మొదటి విడుతలో రూ.62.4 కోట్లతో 163 చెరువులు, రెండో విడుతలో 76 కోట్ల రూపాయలతో 203, మూడో విడుతలో రూ.70.78 కోట్లతో 240, నాలుగో విడుతలో రూ.25.96 కోట్లతో 127 చెరువుల్లో పూడిక మట్టి తొలగించారు. ఫలితంగా చెరువుల్లో ఏడాది పొడవునా జలకళ కనిపిస్తున్నది. జిల్లాలో వర్షాలు కూడా సమృద్ధిగానే పడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 15శాతం వర్షాలు అధికంగా కురిశాయి. 514 మి.మీ. సాధారణ వర్షపాతం కాగా, 589.7మి.మీ. వర్షపాతం రికార్డయ్యింది.
సూర్యాపేట జిల్లాలో..
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన నీటి వనరులతో సూర్యాపేట జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. 2014లో జిల్లా వ్యాప్తంగా లక్షా 75వేల ఆయకట్టు ఉండగా.. ప్రస్తుతం 5.37లక్షల ఎకరాలకు పెరిగింది.
ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు
సాగర్ నీళ్లు రాకున్నా పంటలు పండుతున్నయి
గతంలో వరి సాగుకు ఎక్కువగా సాగర్ కాల్వ నీటి మీద ఆధారపడేది. అక్కడక్కడ బోరుబావులున్నా కరెంటు సరిగా రాక పంటలు పండకపోయేది. ఇప్పుడు వర్షాలు బాగా కురుస్తుండడంతో బోరుబావుల్లో నీళ్లు పెరిగినయి. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయడంతో నీటి నిల్వ పెరిగింది. దాంతో భూగర్భ జలాలు బాగా పెరిగినయి. బీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుండడంతో రైతులు అనువైన పంటలు వేస్తున్నరు. ఈ సారి సాగర్ కాల్వకు నీళ్లు వదలకపోయినా చెరువులు, బోర్ల కింద వరి, కూరగాయల పంటలు సాగవుతున్నయి. నేను బోరు కింద బెండ సాగు చేసిన. కరువు కాలంలో కూడా మాకు చేతినిండా పని దొరుకుతున్నది.
– ధరావత్ వెంకటేశ్వర్లు, రైతు, మంగలికుంటతండా, మేళ్లచెర్వు మండలం
ఏటా రెండు పంటలు పండిస్తున్నాం
తెలంగాణ రాష్ట్రం రాకముందు సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. బావులు తవ్వించినా, బోర్లు వేయించినా చుక్క నీళ్లు వచ్చేది కాదు. చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్న భూమి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. వానకాలంలో పంటలు సాగు చేసి.. యాసంగిలో బీడు పెట్టేది. కాలం అయితే పంట వచ్చేది.. లేకుంటే పెట్టుబడి మీద పడేది. అప్పటి వ్యవసాయం పొట్ట, బట్టకు కూడా సరిపోయేది కాదు. పండుగొచ్చినా, పబ్బమొచ్చినా షావుకారు వద్ద అప్పు తెచ్చేది. ఎరువులు, విత్తనాల కోసం దేవరకొండకు రోజుల తరబడి తిరిగేది. గంటల కొద్దీ లైన్ నిలబడాల్సి వచ్చేది. కోతల కరెంట్ నానా తిప్పలు పడి పండించిన పంటను మార్కెట్ తీసుకుపోయి పది, పదిహేను రోజులు రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు పునరుద్ధరించడంతో ఏడాది పొడవునా నీళ్లు ఉంటున్నాయి. నాకు 4ఎకరాల భూమి ఉంటే.. గతంలో ఒక ఎకరంలో వరి వేసేది. ఇప్పుడు మూడెకరాల్లో సాగు చేస్తున్నా. సీఎం కేసీఆర్ దయ వల్ల నీళ్లగోస లేకుండా పోయింది. వ్యవసాయానికి 2త4 గంటల కరెంట్, మద్దతు ధర ఇచ్చి గ్రామాల్లోనే ధాన్యం కొనడంతో రైతుల తిప్పలు తప్పినయి. ఇప్పుడు విత్తనాలు, ఎరువుల కొరత లేదు. వానల కోసం మొగులు దిక్కు చేసే పరిస్థితి లేదు. పుష్కలంగా నీళ్లు ఉండడంతో ఏటా రెండు పంటలు పండిస్తున్నాం. రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ సర్కార్ మరో 10 కాలాలు ఉండాలి.
– బూడిద రమేశ్, రైతు, కొండమల్లేపల్లి
సంవత్సరమంతా కిరాయిలు దొరుకుతున్నయి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాన్నుంచి వర్షాలు బాగా కురుస్తుండడం, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడంతో వ్యవసాయ రంగం చాలా మెరుగుపడింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి పని దొరుకుతున్నది. రాష్ట్రంలో సంవత్సరానికి రెండు పంటలు పండటంతో ధాన్యం దిగుబడి బాగా పెరిగింది. మిర్యాలగూడ పట్టణంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండటంతో వివిధ రాష్ర్టాలకు బియ్యం ఎగుమతుల కోసం వెళ్లే నా లాంటి లారీ యజమానులకు సంవత్సరమంతా కిరాయిలు దొరుకుతున్నాయి. సీజన్ ఎరువుల లోడ్ కూడా వెళ్తాం. గతంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రోడ్లు కూడా బాగుపడటంతో మా ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రభుత్వం సాగునీటి రంగాన్ని బాగు చేయడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నది.
– షరీఫ్, లారీ యజమాని, బంగారిగడ్డ, మిర్యాలగూడ పట్టణం
అప్పుడు కూలి దొరుకలే.. ఇప్పుడు కూలీలు దొరకట్లేదు
మా గ్రామంలో వారసత్వంగా వచ్చిన భూమిలో ఐదేండ్ల క్రితం వరకు అరకొరగా పత్తి, కంది, పెసర పంటలు వేసేవాళ్లం. యాసంగిలో బీడుగా ఉంచేది. వర్షం నీళ్లు, బోరు నీళ్లు తప్ప.. మరే కాల్వ నీళ్లు వచ్చేవి కాదు. కరెంట్ ఎప్పుడిస్తరోనని రేయింబవళ్లు పడిగాపులు కాసేది. అప్పుడు వ్యవసాయ పనుల్లేక కూలికి వెళ్దామన్నా దొరక్కపోయేది. కాల్వ కింద ఊళ్లకు కూలికి పోయినం. ఇప్పుడు ఇతర ప్రాంతాల వలస కూలీలకు పనులు కల్పిస్తున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్ చెప్పినట్టే మా కాల్వల్లో కాళేశ్వరం నీళ్లు చూసినం. ఇక్కడ తీసిన కాల్వల్లో నీళ్లు వస్తాయనుకోలేదు. ఇప్పుడు మా కాల్వల్లో వద్దన్నా నీళ్లు వస్తున్నాయి. ఎండాకాలంలోనూ చెరువులు నిండు కుండల్లా ఉంటున్నాయి. గతంలో పండించిన అరకొర ధాన్యం అమ్ముకునేందుకు సూర్యాపేట మార్కెట్ రోజుల తరబడి ఏదురుచూసినం. అయినా మద్దతు ధర కాదు కదా.. పెట్టుబడి మందం కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టడంతో కాంటా వేసిన తెల్లారే మద్దతు ధరతో మా ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి.
– మచ్చ వెంకటేశ్వర్లు, రైతు, తుల్జారావుపేట, చివ్వెంల మండలం
వేరే రాష్ర్టాలకు పోయే బాధ తప్పింది..
తెలంగాణ రాష్ట్రం రాకముందు కరువు కాటకాలతో పంటలు ఎండిపోయేది. దాంతో రైతులు వ్యవసాయం మానేసి ఇతర రాష్ర్టాలకు పనుల కోసం వలస వెళ్లారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ప్రాజెక్టులను నిర్మించడంతోపాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయించారు. ప్రతి ఏటా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దాంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. అదేవిధంగా ప్రాజెక్టుల నుంచి వానకాలం, యాసంగి సీజన్లలో సమయానికి నీటిని విడుదల చేయడంతో వరి సాగు పెరిగింది. దీంతో ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన రైతులు తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. గతంలో వరి సాగు తక్కువ ఉండడంతో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు కోత మిషన్ల వినియోగం పెరుగడంతో హార్వెస్టర్ కొనుగోలు చేశాను. ఆరు సంవత్సరాల నుంచి సీజన్ 350 నుంచి 400 గంటల వరకు నడుస్తున్నది. ఖర్చులన్నీ పోయి సీజన్ రూ.3లక్షల వరకు మిగులుతున్నాయి. గతంలో వరి కోత మిషన్లకు సరిపడా పనులు లేకపోవడంతో బ్యాంకు కిస్తీలు కట్టలేక అమ్ముకున్న పరిస్థితి. రా్రష్ట్రంలో నీటి వనరులు పెరుగడంతో వ్యవసాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరాజిల్లుతుంది. దాంతో హార్వెస్టర్లు వరి కోతల సమయంలో రోజుకు 10 నుంచి 14 గంటల వరకు పని చేస్తుండడంతో సమయానికి బ్యాంకు కిస్తీలు కట్టగలుగుతున్నాం. పని కోసం వేరే రాష్ర్టాలకు వలస పోయే బాధ తప్పింది.
– జేరిపోతుల హరీశ్, హార్వెస్టర్ యజమాని, మొల్కపట్నం, వేములపల్లి మండలం
నాడు పని లేదు.. నేడు తీరిక లేదు
నాడు బోర్లు పోయక సాగు పనుల్లేక ట్రాక్టర్ పని దొరుకకపోయేది. దాంతో ట్రాక్టర్ కిస్తీ కట్టడానికి చాలా ఇబ్బంది పడేది. పొలాలు కూడా ఎక్కువ ఉండేవి కావు. నేడు భూగర్భ జలాలు పెరిగిపోయి వరి సాగు విపరీతంగా పెరిగింది. ఎక్కడా ఖాళీ జాగా కనిపించడంలేదు. దాంతో ట్రాక్టర్లకు నిరంతరం పని దొరుకుతున్నది. దున్నకం, ఇతర వ్యవసాయ పనులతోపాటు వరి ధాన్యం తరలింపుతో తీరిక లేకుండా ఉన్నాం.
– కస్పరాజు రమేశ్, ట్రాక్టర్ డ్రైవర్, తిప్పర్తి
ట్రాక్టర్ల వాడకం ఎక్కువైంది
ఒకప్పుడు వర్షాలు సరిగా పడక, కరెంట్ లేక, బోర్లు పోయకపోవడంతో పంటలు ఎండిపోయేది. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. ఆత్మహత్యలకు సైతం పాల్పడిన ఘటనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 24గంటల విద్యుత్ ఇస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. దాంతో పొలాలను దున్నడానికి ట్రాక్టర్లను ఎక్కువగా వాడుతున్నారు. ట్రాక్టర్ల వాడకం ఎక్కువ కావడం వల్ల మాకు కూడా మంచిగా పని దొరుకుతున్నది. రైతులు ఎక్కువగా పొలాలను దున్నడానికి, చదును చేయడానికి, తూర్పార పట్టడానికి ఒకేసారి కిరాయి ఇస్తుండడంతో ట్రాక్టర్ ఈఎంఐలు క్లియర్ చేసుకోగలుగుతున్నాం.
– పసుపులేటి సైదయ్య, ట్రాక్టర్ యజమాని, అడవిదేవులపల్లి
చేతినిండా పని దొరుకుతున్నది
గతంలో నెలకు పది రోజులు కూడా పని దొరకకపోయేది. పక్క ఊర్లకు పోయేటోళ్లం. ఆరేండ్లుగా మాకు ఊర్లోనే రోజూ పని దొరుకుతుంది. ఎండకాలంలోనే ఇంటికాడ ఉంటున్నం. మిగతా రోజుల్లో ఏదో ఒక పనికిపోయి డబ్బులు సంపాదించుకుంటున్నం. సీఎం కేసీఆర్ చేసిన పనుల వల్ల చెరువుల్లో నీళ్లు ఫుళ్లుగా ఉంటున్నయి. దీనివల్ల బోర్లు పుష్కలంగా పోయడంతో పొలాలు సాగు చేసుకుంటుండ్రు. మా ఊర్లో పత్తిచేలు ఎక్కువ వేసిండ్రు. సమయానికి వానలు పడుతుండటంతో చేన్లు మంచిగున్నయి. వానలు పడిన తొలి రోజుల్లో వరి నాట్లకు పోతే.. రోజూ రూ.500 వచ్చేది. ఇప్పుడు పత్తి చేలో కలుపు తీస్తున్నం. కూలి రూ.250 ఇస్తరు. చేలల్లో మందు కొట్టడం, కలుపు తీయడం, పత్తి ఏరడం, మిరప చేలల్లో కలుపు తీయడం, మిర్చి ఏరడం వంటి పనులు దొరుకుతున్నాయి. ఊర్లోనే పని చేసుకుంటూ నెలకు పది వేల వరకు సంపాదించుకుంటున్నం.
– ఊర పద్మ, తాళ్లవీరప్పగూడెం, దామరచర్ల మండలం
కాళేశ్వరం జలాలతో పంటలు పండిస్తున్నాం
పదేండ్ల క్రితం బావులు, బోరు నీళ్లపై ఆధారపడి పంటలు పండించేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలతో చెరువులను నింపడంతో నిండుకుండలా కనిపిస్తున్నాయి. కాల్వల ద్వారా గోదాదరి జలాలు రావడంతో సంవత్సరానికి రెండు కార్లు వరి పండిస్తూ కొంత నిమ్మతోట సాగు చేస్తున్నా. నిమ్మతో సంవత్సరానికి లక్ష ఆదాయం పొందుతున్నా. పండించిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో అమ్మితే వారం రోజుల్లోనే డబ్బులు ఎకౌంట్ పడుతున్నాయి. రైతుబంధు పైసలతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నాం. బ్యాంకులో రుణమాఫీ కూడా జరిగింది. రైతులమంతా సంతోషంగా ఉన్నాం. పేద రైతుల కష్టాలు తీరాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సాధ్యం.
– వెలుగు సునీల్, రైతు, కర్విరాల, తుంగతుర్తి మండలం
ఊళ్లోనే ట్రాక్టర్ నడుపుతున్నా..
ఉమ్మడి రాష్ట్రంలో భూములన్నీ పడావు ఉండేది. అక్కడక్కడ వానల మీద ఆధారపడి మెట్ట పంటలు వేసేటోళ్లు. ఎకరం, అరెకరం ఉన్నోళ్లు నాగళ్లతోటి దున్నుకునేది. ఊరికో ట్రాక్టర్ కూడా ఉండేది కాదు. మాకు భూమి లేదాయే.. ఏమన్నా చేద్దామంటే పని లేకపాయే. ఇల్లు గడవక పట్నంలో అడ్డ మీద కూలికి పోయినం. వ్యవసాయం నడువక భూములు ఉన్నోళ్లు కూడా ఊర్లు వదిలిపెట్టి పట్నం బతకబోయిండ్రు. ఊర్లో మూసలోళ్లు, పడిగొల్లే ఉండేటోళ్లు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ గోదావరి నీళ్లను ఇక్కడికి తెచ్చిండు. దాంతో ఎన్నో ఏండ్ల నుంచి పడావుబడ్డ భూములు సాగయినయి. ఇప్పుడు మా ఊర్లో 50 ట్రాక్టర్లు అయినయ్. నేను ఐదేండ్లుగా మా ఊళ్లోనే ట్రాక్టర్ డ్రైవర్ పని చేస్తున్నా. నెలకు రూ.15వేల జీతం వస్తుంది. మా కుటుంబ సభ్యులకు వ్యవసాయ పనులు చేతినిండా దొరుకుతున్నాయి. ఊర్లన్నీ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. గింత తక్కువ కాలంలో రాష్ట్రం గిట్ల ఎట్టా మారిందని ఆశ్చర్యం కలుగుతుంది.
– గండమళ్ల భిక్షం, ట్రాక్టర్ డ్రైవర్, వర్ధమానుకోట, నాగారం మండలం