అలనాటి తెలంగాణ వైభవానికి, చారిత్రక వారసత్వానికి ప్రతీకలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ను రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుంచి తొలిగించే కాంగ్రెస్ సర్కారు కుట్రలపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి, తెలంగాణ అస్థిత్వానికి చిహ్నాలుగా కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను ప్రజలు గొప్పగా భావిస్తుంటారు. అలాంటి వాటిపై రాచరికపు ఆనవాళ్లన్న ముద్ర వేసి వాటిని తెరమరుగు చేయాలనుకోవడం సీఎం రేవంత్రెడ్డి అజ్ఞానమే తప్ప, గొప్పదనం కాదని ప్రజలు మండిపడుతున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, మే29(నమస్తే తెలంగాణ)
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాకతీయ కాలం నాటి చారిత్రక కట్టడాలు, గొలుసుకట్టు చెరువులు, ప్రాచీన శివాలయాలు ఇలా ఎన్నో నేటికీ జిల్లా ప్రజలతో విడదీయలేని చారిత్రక బంధాలుగా కొనసాగుతున్నాయి. ప్రజల రోజువారీ జీవన విధానాల్లో ఇప్పటికీ కాకతీయుల కృషి ఫలితాల ప్రభావం ఎంతో ఉంటుంది. చరిత్రకారులు చెప్తున్న దాని ప్రకారం కాకతీయుల రాజధానిగా విలసిల్లిన ఓరుగల్లుకు ఆనుకుని ఉండడంతో నల్లగొండపైనా కాకతీయుల ముద్ర చెరిపినా చెరిగిపోదు. కాకతీయుల కళాతోరణానికి శాలిగౌరారం మండలంలోని వల్లాలలో వెలసిన శిలాతోరణమే మాతృక అని చరిత్రకారులు ధ్రువీకరించారు. దీనికి తోడు కాకతీయ మహారాణి రాణిరుద్రమదేవి నకిరేకల్ మండలం చందుపట్లలో శివైక్యం చెందినట్లుగా ఓ శాసనం నేటికీ ఉంది.
రాణిరుద్రమదేవితోపాటు ఆమె సేనాని మల్లిఖార్జున నాయకుడి మరణాలకు గుర్తుగా రుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి చందుపట్ల శాసనం వేయించినట్లు చరిత్ర చెబుతున్నది. 1289 నవంబర్ 27న రుద్రమ మరణించినట్లు శాసన లిఖితాక్షరాలు చెప్తున్నాయి. ఇక చందుపట్ల గ్రామం శివార్లలో నేడు పెద్ద చెరువుగా పిలుస్తున్న అలనాటి రా-సముద్రం పేరు సైతం పొదిగి ఉంది. శివారాధకులైన ఓరుగల్లు పాలకులు నాడు ఈ మార్గం గుండా పిల్లలమర్రి, ఇనుపాముల, చందుపట్ల, పానగల్లు పట్టణాల మీదుగా శ్రీశైలానికి వెళ్లే వాళ్లని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక పానగల్లులోని ఉదయసముద్రం చెరువు, దాని దిగువన ఛాయ, పచ్చల సోమేశ్వరాలయాలు కూడా కాకతీయ కాలంలోని పాలన
వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
కాకతీయులు నిర్మించిన పానగల్లు, పిల్లలమర్రి శివాలయాలు శతాబ్దాలుగా ప్రజల చెరుగని విశ్వాసాలకు కేంద్రాలుగా మారాయి. రాచకొండ, దేవరకొండ లాంటి ప్రాంతాలు సైతం కాకతీయుల పాలనలో ప్రసిద్ధి చెందినవిగా భావిస్తారు. జిల్లాకు చెందిన ఇలాంటివి ఎన్నో శతాబ్దాలుగా ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయి, ప్రగతికాముక చిహ్నాలుగా నిలుస్తున్నాయి. కాకతీయుల కాలం నాటి కట్టడాలు, నిర్మితాలతో ఉమ్మడి నల్లగొండకు కూడా చారిత్రక వైభవం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కాకతీయ కళాతోరణాలను రాచరికపు ఆనవాళ్లంటూ కాంగ్రెస్, ఆ పార్టీ సీఎం రేవంత్రెడ్డి భావిస్తుండడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా చరిత్రకారులు, సాహిత్యకారులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
అధికార చిహ్నంలో మార్పులు చేయగలరేమో కానీ, అనాదిగా ప్రజల మనస్సులతో పెనవేసుకుపోయిన కాకతీయ వైభవాన్ని చెరిపివేయలేరని స్పష్టం చేస్తున్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ను రాచరికపు ఆనవాళ్లు అని చెప్పడమంటే రేవంత్రెడ్డికి చరిత్ర పట్ల, చారిత్రక అంశాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన పట్ల చిత్తశుద్ధి ఉంటే జనం జీవితాల్లో వెలుగులు నింపే మార్పులు చేపట్టాలని హితవు పలుకుతున్నారు. చరిత్ర ఆనవాళ్లను చెరిపివేస్తే కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రేవంత్రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించబోవని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ కళా తోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించాల్చిన అవరసం ఏమొచ్చింది? కాకతీయ తోరణం, చార్మినార్ అనేవి ఏ ఒక్కరి సోత్తు కాదు.. తెలంగాణ ప్రజల ఆత్మతో కూడిన చిహ్నాలు. ఇప్పుడు వీటిని తొలగించడం రేవంత్రెడ్డి అహంకారానికి నిదర్శనం. తెలంగాణలోని కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు దీన్ని ఒప్పకోరు. రేవంత్రెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి గతంలో ఉన్న వాటిని అలాగే ఉంచాలి. గతంలో ఆంధ్రప్రదేశ్లో నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఖిలాపై ఉన్న పూర్ణకుంభం రాష్ట్ర ముద్రలో ఉంది. వాటిపై ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణలో ఎవ్వరూ అభ్యంతరం చెప్పలే. అందరూ హర్షించారు.
ఇప్పుడు రేవంత్రెడ్డి ఏ అవసరం కోసం వీటిని తొలగిస్తున్నారు? అలాగే అందెశ్రీ ర చించిన జయ జయహే తెలంగాణ గేయాన్ని ఆంధ్రాకు చెందిన సంగీత దర్శకునితో ఆంధ్రాకు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటిని వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సంస్కృతి, కళలను నాశనం చేసేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ అస్థిత్వాన్ని చెడగొడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
– బక్క పిచ్చయ్య, వ్యవస్థాపక అధ్యక్షుడు, కోమలి కళా సమితి, నల్లగొండ.
తెలంగాణ రాష్ట్ర గీతంలో రాచరికపు ఆనవాళ్ల పేరుతో తెలంగాణ శౌర్య ప్రతాపాలకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్ వంటి చారిత్రాత్మక కట్టడాలను తొలగించడం తెలంగాణ ఆత్మ గౌరవానికి తీరని నష్టం. కవులు, రచయితలు, కళాకారులకు సాహితీవనం, కవనానికి పెట్టింది పేరు కాకతీయు కళాతోరణం, చార్మినర్ వంటి చారిత్రాత్మక కట్టడాలను రాష్ట్ర గీతం నుంచి తొలగించకుండా అవసరమైతే కొత్త వాటిని పొందుపర్చాలి తప్ప తీసివేయడం సరి కాదు. ముఖ్యమంత్రి మరోమారు ఆలోచించుకోవాలని కవులు, రచయితలు, సాహితీ అభిమానుల పక్షాన కోరుతున్నాను. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి తెలంగాణ అస్థిత్వాన్ని మరుగున పడకుండా ప్రగతి పథంలో అభివృద్ధి చేయాలి. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సైతం పరిగణలోకి తీసుకొని కాకతీయ కళాతోరణం వేయి స్తంభాల గుడి వంటి వాటిని గేయంలో పొందుపర్చాలి.
– పోతుగంటి వీరాచారి, కవి రచయిత, సూర్యాపేట
జయ జయహే తెలంగాణ గేయానికి ట్యూన్ మార్చి రికార్డు చేసేందుకు కీరవాణిని ఎన్నుకోవడం విడ్డూరంగా ఉంది. ఈ పాటకు ప్రోగ్రామింగ్ చేసే నైపుణ్యం ఉన్న వాళ్లు తెలంగాణలో లేరనుకున్నారా? ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడు ట్యూన్ మార్చితే ఆ పాట జీవం దెబ్బతింటుంది. పాట బయటికి వస్తే గానీ పరిస్థితి అర్థం కాదు. ఏది ఏమైనా సాహిత్యం, సంగీతం రెండింటికీ సంబంధించిన క్రెడిట్ అందెశ్రీకే దక్కాలి. ఎందుకంటే పాటకు ఎవరు బాణి(ట్యూన్) సమకూరుస్తారో వారే సంగీతం వహిస్తున్నట్లు లెక్క. మిగతా వాయిద్య సహకారం అంతా మనం కోరుకున్న విధంగా మన ఇష్టం వచ్చిన వారితో పని తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆంధ్రా సంగీత దర్శకుడి సారథ్యంలో వినాల్సి రావడం తెలంగాణ ప్రజల దురదృష్టం. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మన పాటలకు సంగీతం అందించమంటే కాదన్న వాళ్లను ఇప్పుడు నెత్తిన పెట్టుకొని ఊరేగడమే. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
-అభినయ శ్రీనివాస్, సినీ గీత రచయిత, మోత్కూరు