కారేపల్లి, జూలై 23 : విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ ను ఖండిస్తూ వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్యూ కారేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వై.జానకి మాట్లాడుతూ… ఉన్నత విద్యలో నెలకొన్న అవినీతి, పరీక్షల అక్రమాలు, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన శాంతియుత ధర్నాపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం అన్నారు. విద్యార్థులను బలవంతంగా చెదరగొట్టడం, పలువురిని అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆ హక్కును అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించడం హేయమైన చర్య అన్నారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వారిపై లాఠీలు జులిపించడం కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని మరోసారి బహిర్గతం చేసిందన్నారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ను ఖండిస్తూ, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పిడిఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు గాంధీ, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, కారేపల్లి మండల కార్యదర్శి సంజయ్, చందు, సన్నీ పాల్గొన్నారు.

విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం