నల్లగొండ : ఈ నెల 12 న కాకతీయ వైభవ సప్తాహం ఒక రోజు కార్యక్రమం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ తో కలిసి జిల్లాలో కాకతీయ వైభవ సప్తాహంపై ఏర్పాట్లను సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయ వైభవ సప్తాహం ఈ నెల 12 న చందు పట్ల గ్రామంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభ మవుతుందన్నారు. ఈ కార్యక్రమం కాకతీయుల వైభవాన్ని అందరికీ తెలిసేలా నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా నిర్వహించి విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు,శాసన మండలి చైర్మన్, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంత వంటకాలను అందరికీ పరిచయం చేసే విధంగా స్టాల్ ల ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
చందు పట్ల లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాకతీయ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి పై పేరిణి,కూచిపూడి నృత్యం, నాటిక, తెలంగాణ సాంస్కృతిక సారధిలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు