Jitta Balakrishna reddy | యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో భారీ అనుచరగణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. గురువారమేహైదరాబాద్లో వారితో జిట్టా బాలకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.
చర్చించారు. ఇక పార్టీలో చేరడమే తరువాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2009 వరకు అప్పటి టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన వివిధ సమీకరణాల నేపథ్యంలో పలు పార్టీలు మారుతూ వచ్చారు. తాజాగా సొంతగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
బీఆర్ఎస్లోకి జిట్టా చేరికతో భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతగలనున్నది. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆయన ఆ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. మూడు నెలల క్రితం కుంభం అనిల్ కుమార్రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో అక్కడ ఖాళీ భర్తీ చేయడానికి జిట్టా కాంగ్రెస్లో చేరారు. కానీ తీరా కుంభం సొంతగూటికి రాగానే బాలకష్ణారెడ్డికి టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసిన జిట్టా బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్లారు. భువనగిరి నియోజకవర్గంలో జిట్టా బాలకృష్ణారెడ్డికి పట్టుంది. తనకంటూ ఓ ప్రత్యేక కేడర్ ఉంది. 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. జిట్టా చేరికతో బీఆర్ఎస్ మరింత బలపడనుంది. ఎన్నికల్లో సునాయాస విజయం దక్కడంతోపాటు భారీ మెజార్టీ సాధించనున్నది.