పెద్దవూర, జనవరి 29 : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31తో గడువు ముగియనున్నది. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి చలకుర్తిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో మొత్తం 80 సీట్లు కేటాయించారు. 1986లో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అప్పట్లో దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాకు సంబంధించి చలకుర్తి గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయన్ని నిర్మించారు.
ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష ద్వారా 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పిస్తారు. 6 నుంచి 8వ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృభాషలో విద్యా బోధన జరుగుతుంది. ఆ తర్వాత గణితం, సైన్స్ సబ్జెక్టులు ఆంగ్లభాషలో, సామాజిక శాస్ర్తాలు హిందీ భాషలో బోధిస్తారు. చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో మొత్తం 80 సీట్లు ఉండగా, అందులో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంతం వారికి కేటాయించారు. గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించాలంటే 3,4,5 తరగతులు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. ఏ ఒక్క రోజు పట్టణ, మున్సిపాలిటీల్లో చదివినా గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కసారి పరీక్షకు హాజరైన విద్యార్థి రెండోసారి హాజరయ్యేందుకు అవకాశం లేదు.
ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం బాలికలకు మొత్తం సీట్లలో 1/3 వంతు రిజర్వేషన్ సౌలభ్యం ఉంది. దరఖాస్తు విధానం 6వ తరగతిలో ప్రవేశానికిగాను విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జేఎన్వీనల్గొండ.ఇన్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంపై ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం చేయించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 5వ తరగతి ఏ పాఠశాలలో చదువుకున్నారో అక్కడి నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకుని అప్లోడ్ చేయాలి. దరఖాస్తుపై విద్యార్థి, తండ్రి సంతకాలు తప్పకుండా ఉండాలి. ఫొటో కూడా అప్లోడ్ చేయాలి.
అర్హులు వీరే..
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ 01.05.2011 నుంచి 30.04.2013 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ నింబధన ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాలకు వర్తిస్తుంది.