పాలకవీడు, జనవరి 24 : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగే సైదులు బాబా ఉత్సవాలకు దర్గా నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏడాదికి ఒకసారి జనవరి చివరి మాసంలో జరిగే ఉర్సుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఉత్సవాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.13 లక్షలు కేటాయించింది. ఉర్సును పురస్కరించుకొని దర్గాకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ పరిసరాలు దుకాణాల సముదాయాలతో కళకళలాడుతున్నాయి.
ఉర్సులో తొలిరోజు గురువారం గుసూల్ షరీఫ్ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా సైదులు బాబా సమాధులు, దర్గా పరిసరాల్లో ఉన్న సిపాయిల సమాధుల మీద ఉన్న పాత చాదర్లను తొలగించి శుభ్రం చేస్తారు. అనంతరం సమాధులపై పూలు, దట్టీలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తారు.
ఉర్సులో ప్రధాన ఘట్టం గంధం మహోత్సవం. 26న శుక్రవారం ఘనంగా నిర్వహిస్తారు. గంధం కలశానికి పూజలు చేసి చందల్ఖానకు ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ హైదరాబాద్ వక్ఫ్బోర్డు వారు తెచ్చిన గంధాన్ని తీసుకొని జాన్పహాడ్ గ్రామంలో ఊరేగింపుగా తిరుగుతూ దర్గా వద్దకు చేరుకొంటారు. పవిత్ర గంధాన్ని బాబా సమాధుల పెట్టి ప్రార్థనలు నిర్వహిస్తారు. గంధాన్ని తాకితే సంవత్సరం అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. 27న ఉదయం ప్రత్యేక దర్శనాల అనంతరం శనివారం సాయంత్రం దీపారాధనతో ఉర్సును ముగిస్తారు.
ఉర్సుకు వచ్చే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ డిపోల నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచేలా ఏర్పాటు చేసింది. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సులను దామరచర్ల మీదుగా జాన్పహాడ్ దర్గాకు .. సూర్యాపేట, కోదాడ డిపోలకు చెందిన బస్సులను నేరేడుచర్ల మీదుగా నడుపుతున్నట్లు ఆయా డిపో మేనేజర్లు తెలిపారు.
దర్గా వద్దకు వచ్చే భక్తుల కోసం వివిధ శాఖలు అందుబాటులో ఉండనున్నాయి. వైదారోగ్య, పోలీస్, ఆర్టీసీ, అగ్నిమాపక, 108 సిబ్బంది ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశాయి. హుజూర్నగర్ ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, ఎంపీడీఓ వెంకటాచారి ఏర్పాట్లపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. తాగునీరు, పారిశుధ్య సమస్య రాకుండా రెవెన్యూ, పంచాయతీ అధికారులు అన్నీ సిద్ధం చేశారు.
ఇక ఉత్సవాలకు 500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కోదాడ డీఎస్పీ ప్రకాశ్, హుజుర్నగర్ సీఐ రామలింగారెడ్డి తెలిపారు. దర్గా పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దర్గా ఎదుట, లోపల ప్రత్యేక క్యూలైన్లు పెట్టించారు. శూన్యపహాడ్ రహదారి వెంబడి, జాన్పహాడ్ రోడ్ పెట్రోల్ బంక్ వద్ద పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.