సూర్యాపేట, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటలో భారీ అంచనాలతో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభ అట్టర్ ప్లాప్ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కావడంతో భారీ అంచనా, వ్యయంతో ఏర్పాటు చేసిన సభ వెలవెలబోయింది. దాదాపు 30 వేల మంది జనం వస్తారని ఆ మేరకు కుర్చీలు ఏర్పాటు చేయగా వారి అంచనాలు తలకిందులై 10 వేలకు మించి రాలేదు. అసలే తక్కువ సంఖ్యలో జనం రాగా వారు సైతం అమిత్ షా ప్రసంగాన్ని ఆసాంతం వినకుండా బారీకేడ్లను తొలగించుకుని మధ్యలోనే వెళ్లిపోవడం కనిపించింది. బీజేపీ కార్యకర్తలు కాసేపు ఉండాల్సిందిగా వేడుకున్నప్పటికీ వారు ఆగకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు.
జిల్లా వ్యాప్తంగా లారీల్లో జనాన్ని తరలించినా వేసిన కుర్చీలు ఖాళీగా కనిపించాయి. సూర్యాపేట బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్రావు మొదలుకుని అమిత్ షా ప్రసంగిస్తున్న సమయాల్లో సభలో సింహభాగం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఖాళీ కూర్చిలకే తమ ప్రసంగాలను వినిపించిన పరిస్థితి. అమిత్ షా ప్రసంగం సైతం ఆకట్టుకోకపోవడంతో బీజేపీ శ్రేణులు నిరుత్సాహంతో కనిపించాయి. వాస్తవానికి అమిత్ షా ప్రసంగం 45 నిమిషాలు ఉండగా జనం లేకపోవడంతో 12 నిముషాల్లోనే ముగించి వెళ్లిపోయారు. జిల్లా వ్యాప్తంగా జనాన్ని తరలించినా 10 వేలకు మించకపోవడం పట్ల ఇలా ంటి సభలు ఎందుకు పెడుతారని అగ్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద ఈ ప్రాంతంలో బీజేపీకి పట్టు లేకపోగా అమిత్ షా లాంటి అగ్ర నాయకులు వస్తే ఏదో జరుగుతుందనుకున్న ఆ పార్టీ నేతలు జన గర్జన సభ ప్లాప్ కావడంతో తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్నారు.