హాలియా, జూలై 4 : ప్రజల్లో ఆధ్యాత్మికభావం పెంపొందించడంలో ఇస్కాన్ పాత్ర అమోఘమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. సోమవారం హాలియాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడంలో ఇస్కాన్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. జగన్నాథ రథయాత్ర రామాలయం నుంచి ప్రధాన సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు, అక్కడి నుంచి తిరిగి రామాలయం వరకు కొనసాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలను ఉంచి హాలియా పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
రథయాత్రలో పాల్గొనేందుకు భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి రథాన్ని లాగారు. భక్తుల కోలాటం, ఆటపాటల నడుమ రథయాత్ర కోలాహలంగా జరిగింది. కార్యక్రమంలో హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, ఆలయ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, చెరుపల్లి ముత్యాలు, కాకునూరి సత్యనారాయణ, గౌని రాజారమేశ్యాదవ్, మేడేపల్లి మోహన్రావు, వర్రా వెంకట్రెడ్డి, ప్రసాద్నాయక్ పాల్గొన్నారు.