నీలగిరి, జూలై 25 : ఒడిశా నుండి గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ML వీడ్(హాష్) ఆయిల్, 5 బైక్లు, 4 సెల్ఫోన్లు, డమ్మీ తుపాకీ, బట్టన్ చాకు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి శనివారం వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11:00 గంటలకు నల్లగొండ పట్టణం మునుగోడు బైపాస్ రోడ్డులోని ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కొంతమంది యువకులు గుమిగూడి గంజాయిని విక్రయిస్తూ, వినియోగిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో రైడ్ చేసి 8 మందితో పాటు ఓ మైనర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను కస్పరాజు నాగరాజు(20), గంటెకంపు మధు(22), చెన్నపాక సుశాంక్(23), పెండ్ర వాసు(19), సయ్యద్ షోయబ్(21), గంధం శివమణి(19), నకిరేకంటి ధరణి కుమార్(19)గా గుర్తించినట్లు వీరితో పాటు ఓ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. కాగా మనుకర్ నివాసం, హరి నివాసం, ఉదయ్, జున్ను పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో ఛేదించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐ లు సురభి సంపత్, ముత్తయ్య, సిబ్బంది శ్రీనివాస్, శేఖర్, రబ్బాని, సాగర్ల శంకర్, ఆంజనేయులు, అంజద్ ,కిరణ్ అంజయ్య, మహేశ్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.