సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ర్టానికే దిక్సూచిగా నిలిచింది. చరిత్రను తిరుగరాస్తూ సాగు మడిలో రైతన్న ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఈ యాసంగిలో ఏకంగా ఆల్ టైం గ్రేట్ రికార్డు స్థాయిలో 13.48లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం చేరింది. సమైక్య పాలనలో యాసంగిలో అన్ని పంటలు కలిపి నాలుగు లక్షలు దాటడమే గగనం. స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. సాగునీటి కల్పన, ఉచిత కరంట్, పెట్టుబడి సాయంగా రైతుబంధు, మార్కెట్ సౌకర్యం ఇలా రైతన్న వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా నేడు వరిసాగులో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. యాసంగి రాష్ట్ర వరిసాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లాదే 23.38శాతం ఉన్నది. అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో 158శాతం సాగు అదనంగా పెరిగింది. రాష్ట్ర వ్యవసాయశాఖ యాసంగి పంటల సాగుపై విడుదల చేసిన నివేదికలో ఉమ్మడి జిల్లా అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడైంది.
– నల్లగొండ ప్రతినిధి, మార్చి 31 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, మార్చి31(నమస్తే తెలంగాణ) : గతేడాది యాసంగిలో 10.70 లక్షల ఎకరాల సాగే రికార్డు అనుకుంటే ఈ యాసంగి సాగు సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత యాసంగిలో మార్చి నెలాఖరుకు 13.48 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటల సాగువుతున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. యాసంగిలో ఉమ్మడి జిల్లా సాధారణ విస్తీర్ణం కేవలం 8.71 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. కానీ అంతకు అదనంగా 158.24 శాతం సాగు కావడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కరువు కాటకాలకు నిలయమైతే… నేడు స్వరాష్ట్రంలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తోంది.
జిల్లా చరిత్రలోనే ఏ సీజన్లోనూ లేనంతటి సాగు ప్రస్తుత యాసంగిలో అవుతుండడం గర్వకారణంగా నిలుస్తోంది. యాసంగిలో అన్ని పంటలు కలిపి నల్లగొండ జిల్లాలో సాధారణ విస్తీర్ణం 3,62,845 ఎకరాలు కాగా ప్రస్తుతం 5,78,251 ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో యాసంగి సాధారణ విస్తీర్ణం 3,42,783 ఎకరాలు కాగా ప్రస్తుతం 4,79,638 ఎకరాల్లో సాగైంది. యాదాద్రి జిల్లాలో 1,65,411 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గానూ 2,90,205 ఎకరాల్లో యాసంగి పంటల సాగు జరుగుతోంది. కాగా గత ఏడాది యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 10.70 లక్షల సాగు విస్తీర్ణమే కాగా ప్రస్తుతం అదనంగా 2.78 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి. అదనపు సాగు విషయంలో రాష్ట్ర సగటు 151 శాతమే కాగా నల్లగొండ జిల్లా 159.37 శాతం, సూర్యాపేట 139.92 శాతం, యాదాద్రి జిల్లా 175.44 శాతం కావడం విశేషం.
వరి సాగులో హవా..
వరి సాగులో రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా హావా కొనసాగుతోంది. జిల్లాల వారీగా చూసినా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాలతో ఇతర జిల్లాలకు అందనంత ఎత్తులో నిలిచాయి. యాదాద్రి జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో యాసంగిలో సాధారణ వరిసాగు విస్తీర్ణం 8,36,933 ఎకరాలు కాగా ఈ సీజన్లో ఆల్ గ్రేట్గా 13,20,043 ఎకరాల్లో వరి సాగైంది. సాధారణంగా ఎక్కువ వరి సాగయ్యే వానాకాలం సీజన్లోనూ ఇంతటి సాగు ఎన్నడూ లేదు. గతేడాది ఇదే సీజన్లో 10.12 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా ప్రస్తుతం అదనంగా 3.07 లక్షల ఎకరాలు సాగు కావడం విశేషం. నల్లగొండ జిల్లా 5,53,801 ఎకరాలతో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది.
ఇక సూర్యాపేట జిల్లా 4,76,930 ఎకరాలతో రెండో స్థానం ఆక్రమించింది. మూడో స్థానంలో ఉన్న నిజామాబాద్లో 3.98 లక్షలే కావడం గమనార్హం. 2,89,312 ఎకరాలతో యాదాద్రి జిల్లా ఆరో స్థానంలో ఉంది. గత యాసంగిని పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో 4.33 లక్షలు, సూర్యాపేటలో 4.37 లక్షలు, యాదాద్రిలో 1.41 లక్షల ఎకరాలే వరి సాగైంది. సాగునీరు సంవృద్ధిగా ఉండడంతో పాటు నిరంతర ఉచిత కరెంట్ వరి సాగు ఘననీయంగా పెరగడానికి కారణంగా నిలుస్తోంది. ఓ వైపు గోదావరి జలాలు, మరోవైపు కృష్ణాజలాలు, మధ్యలో మూసీ జలాలకు తోడు భూగర్భజలాలు సంవృద్ధిగా ఉండడంతో వరి సాగు ఆల్ టైం గ్రేట్ రికార్డుకు చేరుకున్నట్లు స్పష్టం అవుతోంది.
సాధారణానికి వర్షపాతం నమోదు..
సకాలంలో వర్షాలకు తోడు ప్రాజెక్టుల్లోనూ సంవృద్ధిగా సాగు నీరు అందుబాటులో ఉంది. ఈ ఏడాది కూడా సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. గతేడాది జూన్ 1వ తేదీ నుంచి ప్రస్తుత మార్చి 29వ వరకు పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో సాధారణ వర్షపాతం 667.8 మిల్లీమీటర్లు కాగా 796 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సూర్యాపేట జిల్లాలో 793.1మి.మీ.లు కాగా 923.9 మి.మీటర్లు, యాదాద్రి జిల్లాలో 711.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గానూ 952.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. దీంతో వేసవిలో సైతం మెజార్టీ చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అందువల్ల గతంలో ఎన్నడూ లేనంతగా పంటల సాగులో ఉమ్మడి జిల్లా రైతాంగం సరికొత్త చరిత్రను లిఖిస్తుంది.