– డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను
మాడ్గులపల్లి, జూలై 10 : విద్యారంగ సమస్యల పరిష్కారానికై నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కు డీవైఎఫ్ఐ మద్దతు తెలిపి బందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను, మాడ్గులపల్లి మండల కార్యదర్శి ఎలిజాల రమేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 47 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం సరికాదన్నారు. ఒక వైపు పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా యూనిఫామ్స్ ఇవ్వలేదన్నారు. ప్రతి పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి అన్ని ప్రాంతాలకు బస్సులను పునరుద్దరించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించడం లేదన్నారు. రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుండి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.10,500 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కరెంట్, ఇంటర్నెట్, త్రాగు నీరు, వంట షెడ్లు, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్, ఇతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.