పెన్ పహాడ్ : ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. దీంతో అన్నదాతకు సాగునీటి కష్టాలు ( Irrigation water ) మొదలయ్యాయి. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే మాడి పోతుండడంతో నల్కొండ జిల్లా పెన్ పహాడ్ (Penpahad ) రైతులు దిక్కుతొచ్చని స్థితిలో ఉన్నారు.
శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు పరిధిలో వార బంది లెక్క నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టు పంట పొలాలకు నీళ్లు అందక ఎండి పోతున్నాయని చిన్న గరాయ కుంట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గత యాసంగిలో పంట సాగుకు సరిపడా నీళ్లు విడుదల చేయక చేతికొచ్చిన పంట పొలాలు పశువులపాలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
గతం కంటే ఇప్పుడు కేవలం 2 ఎకరాలు నాటు వేసిన అదికూడా పారె పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడంతో శ్రీరాంసాగర్ ఆయకట్టుకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా 9 సంవత్సరాల పాటు వరిని పండించుకున్నామన్నారు .
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నీళ్ల కోసం అరిగోస పడుతున్నామని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు చర్య తీసుకొని చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.