తిరుమలగిరి, మార్చి 19 : సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. చెరువులు వట్టిపోయి, భూగర్భ జలాలు అడుగంటడంతో భూములు నెర్రెలు బారుతున్నాయి. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. బోర్లు వేసినా నీళ్లు పడడం లేదు. కొందరు రైతులు ట్యాంకర్ల నీటి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎండిన వరి పొలాలను చేసేదేమీ లేక పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి నెలకొన్నది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తొండ, తాటిపాముల, నందాపురం, నెల్లిబండ తండా, తిరుమలగిరి, జలాల్పురం, మామిడాల తదితర గ్రామాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఈ యాసంగికి పెట్టిన పెట్టుబడి ఏమోగానీ నష్టాలను చవి చూడాల్సిన వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేండ్ల తర్వాత మళ్లీ కరువు చాయలు కనిపిస్తున్నాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఐదెకరాలు వేస్తే సగం ఎండింది
గత సంవత్సరం మాదిరిగానే ఈ యాసంగికి ఐదెకరాల్లో వరి సాగు చేసిన. గతంలో నిండుగా నీళ్లు పోసిన బోర్లు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. నీళ్లు లేక ఐదెకరాల్లో సగం పొలం ఎండి పోయింది. చేతికి అందిన పంట కాపాడుకోవడానికి వరుస తడులు పెడుతున్నా ఫలితం ఉండటం లేదు.
– సోమేశ్, రైతు, తొండ గ్రామం
రెండు బోర్లు వేసినా ఫలితం దక్కలేదు
యాసంగికి ఐదెకరాల్లో వరి సాగు చేసిన. నీళ్లు అందక రెండు ఎకరాలు గొర్రెలకు మేతగా వదిలేసిన. మిగిలిన మూడెకరాలకు వరుస తడులు పెడుతున్నా నీళ్లు అందడం లేదు. ఇటీవల పంటను కాపాడుకోవటానికి రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. కండ్ల ముందే వరి పొలాలు ఎండుపోతుంటే పాణం తరుక్కుపోతున్నది.
– బోయిని కొమరమల్లు, రైతు, తిరుమలగిరి