ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి కనీసం సింగిల్ లైన్ బీటీ రోడ్డు.. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు.. అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్షరాలా అమలైంది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పట్టణ రోడ్లు మొదలు గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టింది. ఉమ్మడి జిల్లాలో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క పంచాయతీరాజ్ పరిధిలోనే వందల కోట్ల రూపాయలతో నూతనంగా రోడ్లు నిర్మించారు. అవసరమైన చోట్ల బ్రిడ్జిలు కట్టారు. డబుల్ రోడ్లు, రహదారులు, లింక్ రోడ్లు, అండర్ పాస్ నిర్మాణంతో నేడు ఎక్కడా సమస్య లేకుండా ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి.
దంతాలూడుతాయన్న రహదారిపై నేడు దర్జాగా ప్రయాణం నాటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక సందర్భంగా వరంగల్ నుంచి సూర్యాపేటకు దంతాలపల్లి రహదారి మీదుగా చేరుకున్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సదస్సులో మాట్లాడారు. ‘దంతాలపల్లి రోడ్డుపై నడుములోతు గుంతలు ఉన్నయి.. ఎట్ల ప్రయాణం చేస్తున్నరు. దంతాలు ఊడుతాయేమో.. నడుములు విరుగుతాయేమో అన్న భయంతో ప్రయాణించాల్సి వచ్చింది.’ అని ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పాటైతే ఇలాంటి గుంతల రోడ్లు ఉండవు.. మన నిధులతో మనమే అన్నీ చక్కదిద్దుకుంటామంటూ చేసిన ప్రసంగం నేడు అక్షర సత్యమైంది. నేడు దంతాలపల్లి రోడ్డే కాదు జిల్లాలోని అన్ని రోడ్లు బాగుపడి వాహనాలు రయ్య్మ్రంటూ తిరుగుతున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, మే17(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఏ చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ చిత్తడిగా మారేవి. కంకర తేలి, గుంతలతో అస్తవ్యస్తంగా ఉండేవి. బురదమయంగా మారిన మట్టి రోడ్లపై కనీసం నడువలేని పరిస్థితి. ఉన్న అరకొర వంతెనలు శిథిలావస్థకు చేరి అధ్వానంగా దర్శనమిచ్చేవి. అవసరమైన చోట బ్రిడ్జిలు లేకపోవడంతో మోస్తరు వానలకే ఆ ప్రాంతాలు జలమయమయ్యేవి. గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. కానీ సాధించుకున్న స్వరాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతానికి భిన్నంగా ప్రజలకు సౌలత్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు హాయిగా, సాఫీగా ప్రయాణాలు సాగిస్తున్నారు.
3,662 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారులు
ఉమ్మడి జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిత్యం రహదారుల నిర్వహణ కొనసాగుతున్నది. కొత్త రోడ్లు సైతం నిర్మిస్తున్నారు. అవసరమైన చోట రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,662 కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉండగా స్వరాష్ట్రంలో మొత్తం 907 కిలోమీటర్ల రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించారు. ఇందులో మెజార్టీ భాగం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు సింగిల్ వేగా ఉన్న వాటిని డబుల్ లేన్న్ విస్తరించారు. ఇక 1,073 కిలోమీటర్ల మేర తారు లేచిపోయి గుంతలతో అధ్వానంగా మారిన రోడ్లను రెన్యూవల్స్ కింద తిరిగి పునర్నిర్మించారు. ఇక పాడైన రోడ్లకు మరమ్మతులు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ వస్తున్నారు. మొత్తం 1,024 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి కాకుండా నాన్ప్లాన్ వర్క్స్ కింద ప్రస్తుతం 71 పనులకు సంబంధించిన రూ.144.44 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 184 ఆర్అండ్బీ రహదారుల పనులు 416.84 కోట్ల రూపాయలతో వివిధ దశల్లో ఉన్నాయి.
నల్లగొండ నియోజకవర్గంలో
నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఉన్నాయి. గ్రామాల నుంచి ఆయా మండల కేంద్రాలకూ చక్కటి రహదారులు నిర్మితమయ్యాయి. తొలిసారి ప్రభుత్వంలోనే నల్లగొండ నియోజకవర్గంలోనే ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.26.2 కోట్లు వెచ్చించి 54 కిలోమీటర్ల మేర 6 రోడ్లు మళ్లీ వేశారు. పంచాయతీరాజ్ పరిధిలో 27.3 కోట్లతో 58 కిలోమీటర్ల పొడవుతో 19 రహదారులు నిర్మించారు. ఇక రెండో విడుతలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ సుమారు 250 కోట్లతో విస్తరణ చేపట్టారు. ఇప్పటికే మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్ టవర్ వరకు పూర్తికాగా, క్లాక్ టవర్ నుంచి కలెక్టరేట్ వరకు, డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు, కలెక్టరేట్ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి బైపాస్ వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా నల్లగొండ నుంచి మునుగోడు రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించారు. నల్లగొండ నుంచి మేళ్లదుప్పపల్లి వరకు డబుల్ రోడ్డు వేశారు. వీటితోపాటు కనగల్ మండల కేంద్రం నుంచి యాచారం రోడ్డును నూతనంగా నిర్మించారు. నియోజకవర్గంలోని కీలకమైన రహదారులను అభివృద్ధి చేశారు. గ్రామాల మధ్య లింక్ రోడ్లతోపాటు గ్రామాల్లోనూ సీసీ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది.
నకిరేకల్ నియోజకవర్గంలో..
నకిరేకల్ నియోజకవర్గంలో రూ.60.45 కోట్ల నిధులతో నూతన రహదారులు నిర్మించారు. రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లి, నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి.. ఇలా ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో నల్లగొండకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్టంగూర్ నుంచి గతుకుల సింగిల్ రోడ్డుపైనే ప్రయాణం సాగించేది. దీన్ని పూర్తిస్థాయిలో నిర్మించారు. నకిరేకల్ హైవే నుంచి మూసీ ప్రాజెక్ట్కు మూడు కిలోమీటర్ల మేర రూ.2.50కోట్లతో ఆర్అండ్బీ డబుల్ రోడ్డు సహా పలు పనులు పూర్తి చేశారు. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ నుంచి భీమారం వరకు రూ.10 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. చిట్యాల నుంచి మునుగోడుకు ఉన్న సింగిల్ రోడ్డును రూ.5 కోట్లతో డబుల్ రోడ్డుగా, నార్కట్పల్లి నుంచి చిన్నతుమ్మలగూడెం వరకు ప్లాన్వర్క్ నిధులు రూ.10 కోట్లతో 10 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు, నార్కట్పల్లి నుంచి మునుగోడుకు రూ.12 కోట్లతో 12 కి.మీ. డబుల్ రోడ్డు నిర్మాణాలు జరిగాయి.
పుష్కర రోడ్లు
2016-17 ఆర్థిక సంవత్సరంలో కృష్ణా పుష్కరాల సమయంలో ఉమ్మడి జిల్లాలో అనేక రోడ్లు కొత్తరూపం సంతరించుకున్నాయి. పీఆర్ విభాగం ఆధ్వర్యంలో మొత్తం 70.55 కోట్లతో 76 పనులు చేపట్టి పూర్తి చేశారు. చందంపేట, పెద్దవూర, నల్లగొండ మండలాల్లో పలు కీలకమైన రోడ్లకు మహర్దశ కలిగింది. ఇక ఆర్అండ్బీ ఆధ్వర్యంలోనూ రూ.299 కోట్లతో ప్రధాన రహదారులను పుష్కరఘాట్లకు కనెక్ట్ చేసే రహదారులతో అనుసంధానం చేస్తూ నిర్మాణం చేశారు.
దేవరకొండ రోడ్లకు మహర్దశ..
దేవరకొండ నియోజకవర్గం మారుమూల ప్రాంతమైనందున గతంలో ఇక్కడ సరైన రీతిలో రహదారులు అభివృద్ధి చెందలేదు. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో పుష్కరాల పేరుతో రూ.100 కోట్లకు పైగా నిధులు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి రహదారులను తీర్చిదిద్దింది. చందంపేట, నేరేడుగొమ్ము, డిండి.. ఇలా ప్రతి మండల కేంద్రం నుంచి డబుల్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దేవరకొండ మండలం పడ్మట్పల్లి నుంచి చింతపల్లి వరకు 17.5కిలోమీటర్ల మేర రూ.14కోట్ల వ్యయంతో సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించారు. ప్రతి మండలంలోనూ సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించారు. పడ్మట్పల్లి గేట్ నుంచి డిండి-హైదరాబాద్ రోడ్డు వరకు రూ.11.6కి.మీ. మేర రూ.9.28 కోట్లు, డిండి మండలం చెర్కుపల్లి నుంచి తవకలాపురం వరకు 9.6 కి.మీ. మేర రూ.7.28 కోట్లతో డబుల్ రోడ్డు సహా ఇంకా అనేక ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తయ్యింది. నాగార్జునసాగర్ వరకు హైదరాబాద్- సాగర్ డబుల్ రోడ్డును 55 కి.మీ. మేర రూ.119 కోట్లతో ఆధునీకరించారు. చందంపేట మండలం పోలేపల్లి నుంచి కాచరాజుపల్లి వరకు 32కి.మీ.ల మేర రూ.34.7కోట్లతో సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించారు. ఇంకా కంబాలపల్లి, పొగిళ్ల లాంటి అనేక మారుమూల గ్రామాల్లో సైతం స్వరాష్ట్రంలో రహదారుల విస్తరణ జరిగింది.
మిర్యాలగూడ నియోజకవర్గం..
మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ. 82.50 కోట్లతో డబుల్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. దామరచర్ల, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి, వేములపల్లి ఇలా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ల సౌకర్యం ఉంది. పుష్కరాల సమయంలోనే అడవిదేవులపల్లి, దామరచర్ల రహదారులకు మహర్దశ కలిగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పలు గ్రామాల్లో మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా, శిథిలమైన బీటీ రోడ్లను డబుల్రోడ్లుగా కోట్లాది రూపాయలతో విస్తరించారు. మిర్యాలగూడ-కోదాడ రహదారి నుంచి బాదలాపురం మీదుగా జంగాలకాలనీకి గతంలో కంకర రోడ్డు ఉండేది. 2015లో రూ. 82.8 లక్షలతో 1.70 కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు నిర్మించారు. రూ.11.50 కోట్లతో వెంకటాద్రిపాలెం నుంచి దిలావర్పూర్కు 15 కిలోమీటర్లు డబుల్ రోడ్డు నిర్మించారు. ప్రతిసారీ ఎన్నికల హామీకే పరిమితమయ్యే భీమారం-సూర్యాపేట రోడ్డుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించింది. 38 కిలోమీటర్లకు రూ.33 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అడవిదేవులపల్లి నుంచి వయా ఉల్సాయపాలెం మీదుగా తుమ్మడం వరకు 26 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బీ నిధులు రూ.20 కోట్లతో నూతన డబుల్ రోడ్డు నిర్మించారు. మాడ్గులపల్లి మండలం కుక్కడం నుంచి త్రిపురారం వరకు 14 కిలో మీటర్లు గల సింగిల్ రోడ్డును 14 కోట్లతో డబుల్ రోడ్డుగా విస్తరించారు.
దశ మారిన మునుగోడు రోడ్లు..
స్వరాష్ట్రంలో రోడ్ల మహర్దశకు నిఖార్సైన సాక్ష్యంగా నిలుస్తోంది మునుగోడు నియోజకవర్గం. గతంలో పూర్తిగా వెనుకబడ్డ ఈ ప్రాంతంలో సింగిల్ రోడ్లు మినహా డబుల్ రోడ్లు అరుదు. ఎక్కడో ఒక్కటి ఉన్నా.. అవి కూడా పూర్తిగా గతుకుల మయం. ఇక్కడి రోడ్డుపై ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఇక్కడి రోడ్ల దశ పూర్తిగా మారిపోయింది. మునుగోడు మండల కేంద్రానికి నల్లగొండతోపాటు చండూరు, చిట్యాల, నార్కట్పల్లి, సంస్థాన్ నారాయణపురం, హైదరాబాద్ ఇలా నలువైపులా డబుల్ రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. చండూరు, నాంపల్లి, మర్రిగూడెం, నారాయణపురం మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికే జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్ మండలంలోని గ్రామీణ రోడ్లు సరికొత్తగా తయారయ్యాయి. జిల్లా కేంద్రానికి వెళ్లే చౌటుప్పల్ -సంగెం, నాగిరెడ్డిపల్లి రహదారిని విస్తరించారు. చండూరు మండలం బంగారిగడ్డ వాగుపై రూ.4.6 కోట్లతో వంతెన నిర్మించారు. చండూరు నుంచి ఇడికుడ వరకు 15 కిలోమీటర్ల వరకు రూ.12 కోట్లతో పనులు పూర్తి చేశారు. నారాయణపురం మండలం గుడిమల్కాపురం నుంచి మునుగోడు మీదుగా నల్లగొండ మండలం మోటుబావిగూడెం వరకు 38 కిలోమీటర్లకు ప్రభుత్వం 42 కోట్ల నిధులు మంజూరు చేసి డబుల్ రోడ్డుగా విస్తరించింది. చౌటుప్పల్ నుంచి మునుగోడు మీదుగా నల్లగొండ వరకు డబుల్ రోడ్డు అద్దంలా మారింది. మాల్ నుంచి మర్రిగూడ మండలం లెంకలపల్లి వరకు డబల్ రోడ్డు పనులు రూ.27 కోట్లతో చేపట్టారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో..
స్వరాష్ట్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ పట్టింది. నాగార్జునసాగర్ నుంచి జిల్లా కేంద్రం నల్లగొండ వరకు ఉన్న రహదారి జాతీయ రహదారిగా మారింది. రూ.190 కోట్ల నిధులతో 85 కిలోమీటర్ల పొడవున రహదారి అద్భుతంగా తయారైంది. హైదరాబాద్- నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై పెద్దవూర నుంచి పొట్టిచెలిమె వరకు 10.6 కిలోమీటర్లకు గాను రూ.21 కోట్లతో పనులు చేపట్టారు. త్రిపురారం మండల కేంద్రం నుంచి గజలాపురం, అభంగాపురం, కుక్కడం వరకు ఉన్న సింగిల్ రోడ్డును రూ.14కోట్లతో 14కి.మీ.మేర డబుల్ రోడ్డుగా మార్చే పనులు చేపట్టారు. గుర్రంపోడు మండల కేంద్రం నుంచి నాంపల్లి వరకు సుమారు 18 కి.మీ. మేర రూ. 22 కోట్లతో నిర్మాణం చేపట్టారు. దాంతో నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో గ్రామాల నుంచి మండల కేంద్రానికి, ఆయా మండలాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులు పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకున్నాయి. ఇవే కాకుండా గ్రామాల మధ్య ఎన్నో లింక్రోడ్లను నిర్మించారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట, మే 17 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో గతంలో గుంతలు, చిత్తడిగా ఉన్న రోడ్లకు స్వరాష్ట్రంలో మహర్దశ కలుగుతుంది. ప్రధానంగా గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ల నిర్మాణాలు పాత రోడ్ల విస్తరణలు పూర్తికావడంతో నేడు ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. 66 ఏండ్ల ఉమ్మడి పాలనలో రోడ్లకు నోచని గ్రామాలన్నింటికీ నేడు రోడ్లు వచ్చాయి. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయి. దాంతో నాడు పట్టుమని పది కిలోమీటర్లు ప్రయాణించాలంటే అరగంట నుంచి గంట ప్రయాణించాల్సి వచ్చేది. అలాంటిది నేడు స్వరాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో కోట్లాదిగా నిధులు వెచ్చించి రోడ్లు వేస్తున్నారు. జిల్లాలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు అంటే 66 ఏండ్లలో 1,050 కిలోమీటర్లకు మించి రోడ్లు లేకపోగా గత తొమ్మిదేండ్లలో 2,013 కిలోమీటర్లకు పైనే రోడ్లను బీటీ, సీసీలుగా మార్చారు. సూర్యాపేట శాసనసభ్యులు, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలోని రోడ్లన్నీ అద్దంలా మారాయి. భారీగా నిధులు తీసుకొచ్చి 80 శాతం మేర రోడ్లను పూర్తి చేయించారు.
15 నుంచి 60 కిలోమీటర్లకు చేరిన వేగం
2014కు ముందు మారుమూల గ్రామాలే కాదు, మున్సిపాలిటీల్లో సైతం నడుముల్లోతు గుంతలు ఉండేవి. ఇక గ్రామాల మధ్య ఉండే రోడ్ల ఆనవాళ్లు కూడా కనిపించేవి కాదు. అలాంటిది వేల కోట్లు వెచ్చించి అన్ని రోడ్లను బీటీలు, సీసీలుగా మార్చడంతో ప్రయాణం సులభతరంగా మారింది. నాడు పది కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నా అరగంట సమయం పట్టగా, నేడు ఐదు నుంచి పది నిముషాల్లోనే ప్రయాణించేలా రహదారులు తయారయ్యాయి. ఇక గ్రామాల నుంచి మండలాలకు గతంలో 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించగా నేడు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఇక మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రాలకు సైతం గతంలో 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా నేడు డబుల్ లేన్ రహదారులు పూర్తవడంతో 60 కిలోమీటర్లకు మించిన వేగంతో నిమిషాల వ్యవధిలోనే గమ్యం చేరుకుంటున్నారు.
జాతీయ రహదారుల్లోనూ…
కోదాడ నుంచి జడ్చర్ల వరకు నిర్మిస్తున్న 167వ నంబర్ నేషనల్ హైవే జిల్లాలో 80 కి.మీ. మేర విస్తరించింది. ఈ రహదారిని రూ.270 కోట్లతో నిర్మిస్తున్నారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న 765 జాతీయ రహదారి 6 కిలోమీటర్లు మేర, తానంచర్ల నుంచి నకిరేకల్ వరకు రూ.80 కోట్లతో ఎన్హెచ్-365 రోడ్డు 20 కిలోమీటర్లు, నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు 565 నేషనల్ హైవే రూ.189 కోట్లతో 85 కిలోమీటర్ల మేర నిర్మాణంలో ఉన్నాయి. జాతీయ రహదారులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుండడంతో నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి.
40 నిమిషాల్లోనే సూర్యాపేటకు వెళ్తున్నం
ఉమ్మడి రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా ఉండేవి. వాటిపై ప్రయాణం చేయాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వచ్చేది. గుంతలమయంగా మారిన రోడ్లకు తోడు సింగిల్ రోడ్లు కావటంతో తిరుమలగిరి నుంచి సూర్యాపేటకు దాదాపు రెండు గంటలు పట్టేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేశారు. మాకు 356-ఏ జాతీయ రహదారి రావటంతో ఎక్కడికి వెళ్లాలన్నా సులభంగా ప్రయాణం సాగిస్తున్నాం. ఇప్పుడు సూర్యాపేటకు వెళ్లాలంటే 45 నిమిషాల్లోనే చేరుకుంటున్నాం.
-శ్రీనివాస్, ప్రయాణికుడు, తిరుమలగిరి
బ్రిడ్జి నిర్మాణంతో దూరం తగ్గింది
తుంగతుర్తి మండలం రావులపల్లి వద్ద కేతిరెడ్డి వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణంతో సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్లేందుకు దూరం తగ్గింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సహకారంతో ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు కేటాయించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టింది. బ్రిడ్జి నిర్మాణంతో తుంగతుర్తి మండల ప్రజలు తొర్రూరు వెళ్లేందుకు సుమారు 10 కి.మీ. దూరం తగ్గింది. అంతేకాకుండా రెండు జిల్లాల మధ్య వ్యాపారాలు మెరుగయ్యాయి.
– పూర్ణనాయక్, రైతు,ఏనకుంటతండా, తుంగతుర్తి
స్వరాష్ట్రం వచ్చాకనే గుంతల రోడ్లు కనుమరుగయ్యాయి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలోని రహదారులపై బస్సు నడుపాలంటే ఎంతో అవస్థ పడాల్సి వచ్చేది. ఏ రూట్లో వెళ్లినా గుంతల రోడ్లతో ఎక్కువ సమయం పట్టేది. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో రహదారులు నిర్మించారు. దాంతో తక్కువ సమయంలోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. ప్రయాణికులు సైతం బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.
– బి.సైదులు, ఆర్టీసీ డైవర్, మిర్యాలగూడ డిపో
రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు
ఆర్అండ్బీ రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లను సైతం అద్భుతంగా తీర్చిదిద్దారు. గతంలో రోడ్లపై గుంతలు ఉండడంతో బస్సులను నడపాలంటే ఇబ్బందిగా ఉండేది. గుంతలతో బస్సులు రిపేర్లకు వచ్చేవి. చాలా మంది ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు ఈ రోడ్లు ఎప్పుడు బాగు పడతాయోనని తిడుతూ ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్అండ్బీ ఆధ్వర్యంలో గ్రామీణ రోడ్లను వేశారు. గతంలో 50 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటల సమయం పడితే ఇప్పుడు గంటలోనే చేరుకుంటున్నాం.
-గుజర్లపూడి రాజేశ్, ఆర్టీసీ డ్రైవర్, కోదాడ
కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణంతో పెరిగిన రాకపోకలు
మఠంపల్లి, మే 17 : మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణంతో రెండు తెలుగు రాష్ర్టాలే కాకుండా తమిళనాడు రాష్ర్టానికి కూడా రాకపోకలు పెరిగాయి. గతంలో వాహనాల్లో ప్రయాణం చేయాలన్నా, లారీలు వెళ్లాలన్నా దామరచర్ల నుంచి బల్లకట్టుపై, మిర్యాలగూడెం నుంచి ఆంధ్రా ప్రాంతానికి చేరుకోవాల్సి వచ్చేది. మిర్యాలగూడెం నుంచి 80 కి.మీ., దామరచర్లకు 50కి.మీ. పోవాల్సి వచ్చేది. స్వరాష్ట్రం సిద్ధించాక రూ.50కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తవడంతో 2 కి.మీ. దాటితే ఆంధ్రా ప్రాంతానికి చేరుకుంటాం. రెండు గంటల సమయం కలిసి వచ్చింది.
గంట నుంచి 20 నిమిషాలకు తగ్గింది
కుక్కడం నుంచి త్రిపురారం వెళ్లే రోడ్డును గత పాలకులు పట్టించుకోలేదు. సింగిల్ రోడ్డు కావడంతో ఎదురుగా పెద్ద వాహనం వస్తే కిందికి దిగాల్సి వచ్చేది. ఈ రహదారిపై ఎన్నోసార్లు యాక్సిడెంట్లు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ రోడ్డు వేసిండ్రు. గతంలో త్రిపురారం వెళ్లాలంటే గంట సమయం పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లోనే వెళ్తున్నాం. వాహన మైలేజీ కూడా పెరిగింది.
-కొమ్ము సురేశ్, డ్రైవర్, కుక్కడం, మాడ్గులపల్లి