సూర్యాపేట అర్బన్, ఫిబ్రవరి 26 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాల్లో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు మొత్తం 16,602 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. నిమిషం నిబంధన ఈసారి కూడా కొనసాగుతున్నది. ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మెడికల్ సదుపాయాలతోపాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో జనరల్, ఓకేషనల్ విద్యార్థులు మొత్తం 16,602 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో ఫస్టియర్ విద్యార్థులు 8,285 మంది, సెకండియర్ విద్యార్థులు 8,317 మంది. పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉండగా, విద్యార్థులను 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
ప్రైవేట్ కళాశాలలు హాల్ టికెట్లు ఇవ్వని విద్యార్థులు నేరుగా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను పరీక్షల నిర్వహణ కేంద్రాలకు ఉన్నతాధికారులు ఇప్పటికే జారీ చేశారు. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం అవసరమైన అధికారులకు విధులను కేటాయిస్తూ జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు అదేశాలు జారీ చేశారు. ప్రతి సెంటర్కు ఒక సూపరింటెండెంట్ చొప్పున జిల్లాలో 32 మందిని నియమించారు. వారితో పాటు మరో 32 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ఇద్దరు ప్లయింగ్ స్కాడ్లు, ముగ్గురు సిట్టింగ్ స్వాడ్లను ఏర్పాటు చేశారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇంటర్నెట్ ద్వారా హాల్ టికెట్ పొందిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేలా బోర్డు నిర్ణయం తీసుకున్నది. బోర్డు నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. మాస్ కాపీయింగ్ జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-జానపాటి కృష్ణయ్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, సూర్యాపేట