మిర్యాలగూడ, డిసెంబర్ 9 : పట్టణంలో సంచరిస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 25 లక్షల 35 వేల విలువైన బంగారు, వెండి, తదితర సామగ్రిని వన్ టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ వివరాలు వెల్లడించారు.
పట్టణంలోని రాజీవ్చౌక్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా హోండా యాక్టివాపై వెళ్తున్న ముగ్గురు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారించగా తాము పలు చోట్ల దొంగిలించిన బంగారు, వెండి వస్తువులను అమ్మటానికి వెళ్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీరాల మండలం నవాబ్పేటకు చెందిన సయ్యద్ అల్తాఫ్, అలియాస్ నాజర్, అలియాస్ అప్పు, మిర్యాలగూడ మండలం వాటర్ట్యాంకుతండాకు చెందిన రమావత్ సురేశ్, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం సైదాబాసుగూడెం(లాల్సింగ్తండా)కు చెందిన ఆంగోతు నాగరాజు ఉన్నారన్నారు. వీరిలో సయ్యద్ అల్తాఫ్ పీడీ యాక్టుపై నిజామాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవించి జూన్లో విడుదలయ్యాడు.
జైలులోనే పరిచయమైన ఆంగోతు నాగరాజు గ్రామం లాల్సింగ్తండాకు వెళ్లి నాగరాజు స్నేహితుడు సురేశ్తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని హోండా యాక్టివా వాహనంపై పగటి పూట తిరిగి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవారు. రాత్రిపూట ఇనుపరాడ్డు సాయంతో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులు చోరీ చేసే వారని వివరించారు. వీరంతా మిర్యాలగూడ పట్టణ పరిధిలో 4, మండల పరిధిలో 1, సూర్యాపేట జిల్లా సూర్యాపేట టౌన్, రూరల్ పరిధిలో 2, చివ్వెంలలో 1, మునగాలలో 1, హుజూర్నగర్లో 1 మొత్తం 10 చోరీలు చేసినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి 30 తులాల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు, 2 కార్లు, ఒక లెనోవో ల్యాప్టాప్, హోండా యాక్టివా బైక్, తూకం చూసే మిషన్ స్వాధీన పరుచుకొని, ముగ్గురిని కోర్టులో రిమాండు చేసినట్లు చెప్పారు. కేసును ఛేదించిన సీఐ రాఘవేందర్, ఎస్ఐలు సుధీర్కుమార్, కృష్ణయ్య, నర్సింహులు, సిబ్బంది వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రవి, సోమ్లాను డీఎస్పీ అభినందించారు.