నల్లగొండ, ఫిబ్రవరి 22 : ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లాలో 50 పరీక్షా కేంద్రాల్లో 32,895 మంది జనరల్, ఒకేషనల్ విద్యార్థులు, 10వ తరగతికి సంబంధించి 473 పరీక్షా కేంద్రాల్లో 19,715 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు.
పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించాలని, తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర మందులతో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుకూలంగా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రు నాయక్, జిల్లా విద్యాధికారి భిక్షపతి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ యూసఫ్ షరీఫ్ పాల్గొన్నారు.