నీలగిరి, మే 08 : ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలలో శుక్రవారం పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ శిబిరాలు, మేలుజాతి దూడల ప్రదర్శన అలాగే పశువైద్య శిబిరాలు నిర్వహించటం జరిగింది. జిల్లాలోని దామరచర్లలో జరిగిన శిబిరానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హాజరై శిబిరాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పశువులు రైతులకు మంచి ఆదాయ వనరు కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో పశువులను పోషించుకున్నట్లయితే మంచి ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రతి రైతు కూడా విధిగా పచ్చి మేతలు సాగు చేసుకున్నట్లయితే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుందన్నారు. గుట్టకింద అన్నారo, జొన్నలగడ్డ గూడెం, మాడుగులపల్లి, మంగళపల్లి గ్రామాల్లో జరిగిన శిబిరాలకు జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి.రమేశ్ హాజరయ్యారు.

ముమ్మరంగా పశు వైద్య శిబిరాలు.. మేలుజాతి దూడల ప్రదర్శన
ఈ శిబిరాల్లో అనారోగ్యంతో ఉన్న పశువులకు చికిత్సలు, ఎదకు రాని పశువులకు, చూడి నిలవని పశువులకు చికిత్సలు, వేసవిలో పశు పోషణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన, మేలు జాతి పశుగ్రాసాల సాగు, దూడలలో నట్టల నివారణ మందులు వాటి ఆవశ్యకత, గొర్రెల యాజమాన్యం, నాటు కోళ్ల పోషణ మొదలగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ శిబిరాలలో 905 పశువులకు గర్భకోశ పరీక్షలు, 1,221 మేలు జాతి దూడల ప్రదర్శన, నట్టల నివారణ మందులు తాగించడం జరిగిందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అన్ని మండలాల పశు వైద్యాధికారులు, పారా వేటర్నరి సిబ్బంది పాల్గొన్నారు.

ముమ్మరంగా పశు వైద్య శిబిరాలు.. మేలుజాతి దూడల ప్రదర్శన