నల్లగొండ ప్రతినిధి, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : తొమ్మిదేండ్ల స్వరాష్ట్ర పాలనకు సరిగ్గా మరో మూడు నెలల దూరం. కానీ, రాష్ట్రం వచ్చేనాటికి ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరిస్థితులకు, నేటి ప్రగతి పరుగులకు ఎంతో తేడా. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లా అనే పేరే గానీ,అభివృద్ధిలో ఆ ఆనవాళ్లు కనిపించేవి కావు. అలాంటి పరిస్థితుల్లో కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో నల్లగొండతోపాటు కొత్తగా ఏర్పాటైన సూర్యాపేట జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అభివృద్ధిలో అగ్రగామిగా అడుగులు వేస్తున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు.. ఇలా రంగమేదైనా నంబర్ వన్గా నిలుస్తున్నాయి. ఏటా రాష్ట్ర గణాంక శాఖ విడుదల చేసే నివేదికలు ఈ ప్రగతిని ప్రతిబింబిస్తున్నాయి. కృష్ణా జలాల్లో నిక్కచ్చిగా వాటా వినియోగంతోపాటు ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్లు, ఎతిపోతల పథకాల నిర్మాణం, నిర్వహణతో సాగునీటి రంగంలో తిరుగులేని పురోగతి సాధ్యమైంది. వ్యవసాయ వృద్ధితో ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ పీడ విరుగడైంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రభుత్వ దవాఖానాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికల్ కాలేజీలు వరంగా మారాయి. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనలో ఎనలేని ప్రగతి కనిపిస్తున్నది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అభివృద్ధికి
తార్కాణాలుగా నిలుస్తున్నాయి.
స్వయం పాలనలో నల్లగొండ జిల్లా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నది. అన్నింటిలో వెనుకబడిన జిల్లా నుంచి అభివృద్ధిలో అగ్రగామి దిశగా అడుగులు వేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అందుకు ఎన్నో ప్రభుత్వ నివేదికలే నిదర్శనం. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల మెరుగుదల వంటి వాటిల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నీటి వాటాను కచ్చితంగా వినియోగించడంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణం, చిన్న నీటి పారుదలపై దృష్టి పెట్టడంతో వ్యవసాయ రంగంలో తిరుగులేని పురోగతి సాధించింది. నేడు రాష్ట్రంలోనే వరి సాగులో జిల్లా అగ్రస్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. దీంతోపాటు పారిశ్రామికంగా, విద్య, వైద్యపరంగా, మౌలిక వసతుల కల్పనలో మంచి ప్రగతి సాధించింది.
వ్యవసాయంలో అగ్రగామి
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు, కుంటల పటిష్టతో పాటు ఉచిత కరెంటు, రైతుబంధు వంటి పథకాలతో వ్యవసాయంలో జిల్లా గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ యాసంగిలో అన్ని పంటలు కలిపి నల్లగొండ జిల్లాలో 5.55లక్షల ఎకరాలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది యాసంగితో పోలిస్తే ఈ సారి సాగు విస్తీర్ణంలో పెరుగుదల రేటు 153.05శాతంగా నమోదు కావడం విశేషం. రాష్ట్రం ఏర్పడే నాటికి రెండు లక్షల ఎకరాలకు కూడా దాటేది కాదు.
సాగునీటి ప్రాజెక్టులు
జిల్లాలోని సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటి వాటాను కచ్చితంగా వినియోగిస్తున్నారు. అదేవిధంగా సాగర్ వరద కాల్వ నిర్మాణం పూర్తి చేసి 80వేల ఎకరాలకు సాగునీటిని అందజేస్తున్నారు. దీంతో పాటు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇకఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు కొనసాగుతున్నాయి. నక్కలగండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 95శాతం పూర్తయింది. వీటితో పాటు సాగర్ ఎడమ కాల్వపై అదనంగా మరో తొమ్మిది ఎత్తిపోతల పథకాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక జిల్లాలో44 చోట్ల చెక్డ్యామ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. వీటన్నింటి మూలంగా జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే జిల్లా పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కానుంది.
వరి సాగులో రికార్డు
యాసంగి వరి సాగులో నల్లగొండ జిల్లా 5.31లక్షల ఎకరాలతో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. గత యాసంగి నల్లగొండ జిల్లాలో 3.80లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. ఒక్క ఏడాదిలోనే లక్షన్నర ఎకరాల్లో సాగు పెరుగడం గమనార్హం. సాగర్ ద్వారా కృష్ణాజలాలు, మూసీ జలాలకు తోడు సంమృద్ధిగా భూగర్భజలాలు అందుబాటులో ఉండడంతో వరి సాగు భారీగా పెరిగింది. పెట్టుబడి ప్రోత్సాహకంగా రైతుబంధు డబ్బులు, బోర్లు, బావుల కోసం ఉచిత కరెంటు ఇస్తుండడంతో రైతులు వరి సాగులో వెనుదిరిగి చూడడం లేదు.
2021-22 వానకాలం, యాసంగిల్లోనూ వరి సాగులో రాష్ట్రంలో నల్లగొండ రెండో స్థానంలో నిలిచింది. రెండు సీజన్లలో కలిసి 8.95లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. 18.79లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో రికార్డు సృష్టించింది. పత్తి సాగులో నల్లగొండ జిల్లా 6.53 లక్షల ఎకరాలతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. బత్తాయి సాగులోనూ నల్లగొండ జిల్లా 43,673 ఎకరాలతో తనదైన ముద్ర కొనసాగిస్తున్నది.
ఉచిత విద్యుత్లో..
వ్యవసాయ ఉచిత విద్యుత్తు పథకంలో నల్లగొండ జిల్లాకు భారీ లబ్ధి చేకూరుతుంది. 2014లో నల్లగొండ జిల్లాలో 1.46లక్షల కనెక్షన్లు ఉంటే.. నేడు 2.21లక్షలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. వీటి ద్వారా కూడా గణనీయంగా పంటల సాగు అవుతున్నది. గతంలో అత్యధిక బోరుబావులున్న జిల్లాగా ఉన్న నల్లగొండలోనే కరెంటు సమస్య ఎక్కువగా ఉండేది. నేడు స్వరాష్ట్రంలో వాటన్నింటికీ చెక్ పెడుతూ నిరాటంకంగా ఉచిత కరెంటు సరఫరా అవుతున్నది.
పల్లె, పట్టణ ప్రగతి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో మౌలిక వసతుల కల్పన బాగా మెరుగుపడింది. పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికీ ప్రత్యేకంగా ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ అందుబాటులోకి వచ్చాయి. ఇక వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, రైతువేదికల నిర్మాణం జరిగింది. వీటితో పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామీణ జీవనంలో ఇవి విప్లవాత్మక మార్పులకు కారణంగా నిలుస్తున్నాయి. పట్టణాల్లో సైతం ఇలాంటివి ఎన్నో మార్పులు జరిగాయి.
యాదాద్రి థర్మల్ ప్లాంట్
పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దేశానికే తలమానికంగా దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో అవుతున్నది. నాలుగు వేల మెగావాట్లతో దీన్ని నిర్మిస్తుండగా ఈ ఏడాది చివరలో ఒక యూనిట్ను ప్రారంభించేందుకు ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. ఇక పారిశ్రామిక రంగంలోనూ గణనీయమైన వృద్ధి సాధించింది. టీఎస్ఐ పాస్ ద్వారా పరిశ్రమలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 414 ఫ్యాక్టరీలు ఉండగా 24,740 మంది వర్కర్లు, 30,721 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటిల్లో రూ.8,882 కోట్ల ఫిక్స్డ్ క్యాపిటల్గా ఉంది.
ఫ్లోరోసిస్కు చెక్..
నల్లగొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్కు పెట్టింది పేరు. అలాంటిది నేడు మిషన్ భగీరథతో కొత్తగా నమోదు కావడం లేదు. జిల్లాలో మొత్తం రూ.1,976 కోట్లతో పనులు చేపట్టి 1,669 ఆవాసాల్లో ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో గతంలో ఎక్కడ చూసినా ఖాళీ బిందెల ధర్నాలు కనిపించేవి. నేడు నడి వేసవిలో సైతం నీటి సమస్య లేకుండా పోయింది. దీనివల్ల కొత్తగా ఫ్లోరైడ్ కేసులు కూడా లేకుండా పోయాయి.
మెడికల్ కాలేజీ ఏర్పాటు
సమైక్య రాష్ట్రం నుంచి ఊరిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్వరాష్ట్రంలో సాకారమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో మూడేండ్ల కిందట కాలేజీ ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. పైగా దీని వల్ల జిల్లా కేంద్ర ఆస్పత్రి విస్తరణ జరిగింది. గతంలో 250 బెడ్లతో ఉన్న ఆస్పత్రి ప్రస్తుతం 500 బెడ్లకు విస్తరించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటు వల్ల ఎంతో మంది నిపుణులైన వైద్యుల సేవలు దవాఖానలో అందుబాటులోకి వచ్చాయి.
మెరుగైన ప్రభుత్వ వైద్యం
నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు.. అనే దుస్థితి నుంచి ప్రభుత్వ వైద్యం కోసం ప్రజలు తరలి వస్తుండడం విశేషం. డెలివరీలు మొదలుకుని డయాలసిస్ వంటి ఖరీదైన వైద్యసేవల వరకు ఉచితంగానే అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీలను సైతం బలోపేతం చేశారు. ఈ ఏడాది జనవరిలో జిల్లాలో ఖాళీగా ఉన్న 43 పీహెచ్సీల వైద్యుల పోస్టులను కూడా భర్తీ చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ ఏరియా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఇక టీ డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వీటితో పాటు సీటీ స్కాన్తో పాటు అల్ట్రా స్కానింగ్, ఎక్స్రేలు కూడా తీస్తున్నారు. ఉచితంగా అన్ని రకాల మందులు అందజేస్తున్నారు. ఇటీవలే మహిళల కోసం ప్రతి వారం ఉచిత సేవలు కూడా వచ్చాయి.
పెరిగిన విద్యాసంస్థలు
స్వరాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలు గణనీయంగా పెరిగాయి. గతంలో నాగార్జునసాగర్ గురుకులం మాత్రమే ఉండేది. ప్రస్తుతం జిల్లాలో గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు కలిపి మొత్తం 90 విద్యాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో సుమారు 31వేల మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు. వీటికి తోడు మన ఊరు-మన బడి కింద 517 ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాల విద్యలో ఈ ఒక్క ఏడాదే అదనంగా 25వేల మంది విద్యార్థులు పెరిగారు. ఇక గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీలు సైతం అందుబాటులోకి వచ్చాయి.
రహదారుల విస్తరణ
స్వరాష్ట్రంలో ప్రధాన రహదారుల విస్తరణ జరిగింది. తొలి ప్రభుత్వ హయాంలోనే అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు విస్తరించారు. తర్వాత ప్రధాన రహదారులకు నిధులు వెచ్చిస్తూ నాణ్యతతో నిర్మించారు. ఇక అంతర్గత రహదారులు కూడా గ్రామాల్లో 75శాతానికి పైగా పూర్తయ్యాయి. వందల కోట్లతో అంతర్గత రోడ్లను సీసీలుగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో కనెక్టవిటీ బాగా పెరిగింది. ఇక జాతీయ రహదారుల విస్తీర్ణం కూడా జిల్లా మీదుగా పెరిగింది. దీంతో పాటు ప్రమాద స్థలాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.
తలసరి ఆదాయంలో మెరుగు
2020-21 సంవత్సరానికి జిల్లాల వారీగా తలసరి ఆదాయం (పర్ క్యాపిటా ఇన్కం)ను పరిశీలిస్తే ప్రస్తుత రేట్ల ప్రకారం నల్లగొండ జిల్లాలో 2.04లక్షలుగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీడీపీని ప్రస్తుత రేట్ల ప్రకారం పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో 38,927 కోట్లతో రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంది. ఇది 2013-14లో కేవలం రూ.84వేలుగా ఉన్నట్లు సమాచారం.
దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
దశాబ్దాలుగా పట్టి పీడుస్తున్న ఫ్లోరైడ్ పీడ విరగడకు, శాశ్వత పరిష్కారానికి మార్గం చూపిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ చేపట్టి తాగునీరు, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పడం మిషన్ భగరథ విజయానికి చిహ్నం. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ సైతం మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించారు. ప్రతి వ్యక్తికీ స్వచ్ఛమైన జలాన్ని వంద లీటర్లకు తగ్గకుండా క్రమం తప్పకుండా ఇవ్వడంలో దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుంది.
– కంచుకట్ల సుభాశ్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్
లాభాల బాటలో రైస్ ఇండస్ట్రీ
తెలంగాణ ఏర్పాటయ్యాక నిరంతరాయంగా విద్యుత్ అందుతుండడంతో రైస్ ఇండస్ట్రీ లాభాల బాట పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ సరఫరా సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డాం. అప్పటి ప్రభుత్వం వారానికి రెండు మూడ్రోజులు పవర్ హాలిడే ప్రకటించేది. దాంతో మిల్లులు బంద్ చేయాల్సి వచ్చేది. మిగతా రోజుల్లో సైతం లోఓల్టేజీ కారణంగా యంత్రాల్లో సమస్య తలెత్తేది. దాంతో రైస్ ఇండస్ట్రీ సరిగ్గా నడవక తీవ్రంగా నష్టాలు చవిచూశాం. తెలంగాణ ఏర్పాటు కాగానే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రైస్ ఇండస్ట్రీ లాభాల బాట పట్టింది. దాంతో కొత్తగా రైస్మిల్లులు ఏర్పాటయ్యాయి. ఒక్కో రైస్మిల్లు ద్వారా 200 మందికి ఉపాధి లభిస్తున్నది. రైస్ ఇండస్ట్రీ బాగా నడుస్తుండడంతో రైతులకు మేలు కలుగుతున్నది. మిల్లర్లు రైతుల వద్ద ధాన్యాన్ని అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
– బోగవల్లి వెంకటరమణాచౌదరి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, మిర్యాలగూడ
గతంలో నీళ్ల కోసం రెండు కిలోమీటర్లు పోయేటోళ్లం
గతంలో రెండు కిలోమీటర్ల దూరం పోయి నీళ్లు కొనుక్కుంటోళ్లం. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లాలు బిగించడంతో ఇప్పుడు ఇంట్లోకే నీళ్లు వస్తున్నాయి. బయటికి వెళ్లి తెచ్చుకొనే బాధతో పాటు నీళ్ల చింత తప్పింది. మిషన్ భగీరథతో మునుగోడు ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్య అంతమైంది. ఇప్పుడు మంచి నీళ్లు తాగుతున్నాం.
– రెడ్డిమళ్ల కీర్తన, రావిగూడెం, మునుగోడు మండలం
ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువైంది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువైంది. ఎంతో విలువైన వైద్యం ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా అందుతున్నది. గతంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం వెళ్లి చూపించుకునే వాళ్లం. ఇప్పుడు నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్, క్యాన్సర్ రోగులకు పాలీకేర్ యూనిట్లను ఏర్పాటు చేసి విలువైన వైద్యాన్ని అందిస్తున్నారు.
– శింగిరికొండ యామిని, నల్లగొండ
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమైంది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామీణ స్థాయిలో అభివృద్ధి సాధ్యమైంది. మఠంపల్లి మండలంలోని అన్ని గ్రామాలు, తండాల్లో సీసీ, లింక్ రోడ్లు నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు, గ్రామాల్లో పారిశుధ్య పనులు, చెత్త సేకరణకు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. మట్టపల్లిలో కృష్ణానదిపై చేపట్టిన బ్రిడ్జి పూర్తయింది. అదే వంతెనకు అప్రోచ్ రోడ్డు సైతం మంజూరు చేశారు. మిషన్ కాకతీయలో చెరువులు పూడిక తీయడంతో వానకాలం, యాసంగి సీజన్లకు నీరు పుష్కలంగా సరిపోతుంది. తాగునీటికి ఇబ్బంది లేదు. రైతులకు రైతుబంధు వరంలా మారింది. ఆసరా పింఛన్లతోపాటు ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే.
– వంగవీటి వేణుగోపాల్రావు, మఠంపల్లి