వచ్చే నెల 2న నల్లగొండ జిల్లా కేంద్రానికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, సుమారు 750 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతో నల్లగొండ అభివృద్ధిలో ఎంతో మారిందని, ఐటీ హబ్ ఏర్పాటు కొత్త కళ తీసుకొచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అదే రోజున ఎన్జీ కళాశాలలో ప్రగతి నివేదన సభను నిర్వహించనున్నామని, ప్రజలు యువత పెద్ద సంఖ్యలో హాజరై మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
నీలగిరి, సెప్టెంబర్ 24 : నల్లగొండ పట్టణంలో సుమారు 750కోట్ల రూపాయలతో చేపట్టిన పలు రకాల అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనలకు అక్టోబర్ 2న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్లగొండ కలెక్టర్ ఆర్వీ కర్నన్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి పట్టణంలో అభివృద్ధి పనులు పరిశీలించారు. ముందుగా ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాల, పరిపాలన భవనాలు, పరీక్షల బ్రాంచ్, స్టోర్ట్స్ కాంప్లెక్స్ పరిశీలించి మర్రిగూడ బైపాస్, ఐటీ హబ్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు, ఎన్జీ కళాశాల భవనాల పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ అక్టోబర్ 2న నల్లగొండ పట్టణంలో సుమారు 750కోట్ల రూపాయలతో చేప ట్టే పలు రకాల పనులకు శంకుస్థాపనలు, ఇప్పటికే పూర్తి చేసిన పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముందుగా ఎంజీయూలో 15కోట్ల రూపాయలతో చేపట్టిన పలు రకాల అభివృద్ధి పనులు ప్రారంబించి 75కోట్ల రుపాయలతో చేపట్టిన ఐటీ హబ్ను ప్రారంభిస్తారన్నారు. మర్రిగూడ బైపాస్ వద్ద 118 కోట్ల రూపాయలతో చేపట్టిన డివైడర్స్, లైటింగ్, జంక్షన్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. రూ.87కోట్ల అంతర్గత రోడ్ల పనులకు శంకుస్థాపనలు అక్కడే చేస్తారని చెప్పారు.
అక్కడి నుండి ఎన్జీ కళాశాల సమీపంలో రూ.10కోట్లతో చేపట్టిన వెజ్ నాన్వెజ్ మార్కెట్, ఫ్రూట్స్, ప్లవర్ మార్కెట్ పనులు ప్రారంభించి క్లాక్టవర్ సెంటర్కు చేరుకుని రూ.234 కోట్లతో చేపట్టనున్న కళాబారతి, ఉదయసముద్రం ట్యాంక్బండ్, వల్లభరావు చెరువు నెక్లస్రోడ్, ఐటీ హబ్ నుంచి ఉదయ సముద్రం వరకు ట్యాంక్బండ్ రోడ్, ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 216కోట్ల రూపాయలతో యూజీడీ పనులకు, 56కోట్ల రూపాయలతో పట్టణంలో మిగిలిపోయిన ప్రాంతాలకు తాగునీటి పనులు, ఆరు సూట్లతో ఆర్అండ్బీ అతిథి గృహం, కార్యాలయం, 36కోట్ల రుపాయలతో ఎన్జీ కళాశాల ఆదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నల్లగొండ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నందుకు సుమారు 1300నుండి 1400కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని పనులు సంవత్సరం నుంచి రెండేండ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆదేవిధంగా సాయంత్రం ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ప్రగతి నివేదన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు, నల్లగొండ అభివృద్ధిని కాంక్షించే వారు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో ఐటీ హబ్ ప్రారం భం కావడంతో యువతకు ఎంతో మేలని పేర్కొన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, ఎంజీయూ వీసీ గోపాల్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ నరేందర్, ప్రజారోగ్యశాఖ ఈఈ సత్యనారాయణ, కౌన్సిలర్లు ఆలకుంట్ల రాజేశ్వరి, ఎడ్ల శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, ఎంజీయూ సభ్యు లు బోయపల్లి కృష్ణారెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ డీఈలు, ఏఈలు ఉన్నారు.