Governor Tamilisai | రామన్నపేట, ఫిబ్రవరి18 : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి రానునున్నారు. కూరెళ్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు. పాండిచ్చేరి పర్యటనలో ఉన్న గవర్నర్ ఉదయం 11గంటలకు చెన్నై విమానశ్రయం నుంచి 11:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా బయలు దేరి 1 గంటకు వెల్లంకికి చేరుకుంటారు. గ్రంథాలయం ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
హైకోర్టు జడ్జి కూనూరు లక్ష్మణ్ గవర్నర్ రాక ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కూరెళ్ల గ్రంథాలయాన్ని, సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. పోలీసులు గవర్నర్ రాక సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. శివాలయం, గుండ్రాంపల్లి రోడ్డులో వాహనాల పార్కింగ్ను ఏర్పాటు చేశారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ సీహెచ్ లక్ష్మీనారాయణ, తాసీల్దార్ లాల్బహదూర్, ఎంపీడీఓ యాకూబ్నాయక్, సీఐ వెంకటేశ్వర్లు ఎంపీఓ అంజిరెడ్డి ఉన్నారు.
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆచార్య కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం పై అంతస్తులో నూతన భవనం (సాయి సభ మందిరం) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దీనిని ప్రారంభించనున్నారు. అలాగే విఠలాచార్య రచించిన కూరెళ్ల శతకం ద్వితీయ ముద్రణను ఆవిష్కరించనున్నారు. హైకోర్టు జడ్జి కూనూరు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగే సభకు కలెక్టర్ హనుమంతు జెండగే, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రముఖ సినీగేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత కనుకుంట్ల సుభాశ్చంద్రబోస్, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య హాజరు కానున్నారు. మధ్యాహ్నం సాహిత్య సదస్సును నిర్వహించనున్నారు.