చిట్యాల, జూలై 26 : సీఎం కేసీఆర్ పాలనలో సహకార రంగం బలోపేతమైందని, రైతులు సహకార సంఘాల్లో సభ్యత్వం పొంది రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చిట్యాలలో ఏర్పాటు చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శాఖను బుధవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేంద్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తరహాలోనే సహకార రంగం కూడా అద్భుత ఫలితాలు సాధించిందన్నారు. మొదటగా కరీంనగర్ జిల్లా ములకనూరు లాంటి సహకార సంఘాలు వేళ్లమీద లెక్కించే విధంగా ఉండగా.. అనంతరం రైతాంగంలో గణనీయమైన మార్పులు సంభంవించడంతో వ్యసాయ రంగానికి సహకార రంగం సేవలు కీలకంగా మారయన్నారు. రైతాంగానికి సేవలందించడంలో కో-ఆపరేటివ్ బ్యాంకుల పనితీరు భేషుగ్గా ఉన్నదన్నారు. విత్తనాలు, ఎరువుల విక్రయాలతో పాటు ధాన్యం కొనుగోళ్లలో సహకార సంఘాలు రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయన్నారు. సహకార సంఘాలు ఇతర ఆహార ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార సంఘాల అభివృద్ధిలో డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్నారు. సహకార రంగంలో ఆయన గడించిన అనుభవం ఇందుకు తోడైందని ప్రశంసించారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరించారని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త శాఖను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఆరు మండల కేంద్రాల్లో డీసీసీబీ శాఖలను ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా రైతులకు రుణాలు అందించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసీరెడ్డి దయాకర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, ఎంపీపీ కొలను సునీతా వెంకటేశ్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, సింగిల్విండో చైర్మన్ సుంకరి మల్లేశ్గౌడ్, బ్రాంచ్ మేనేజర్ కర్నాటి అశోక్ పాల్గొన్నారు.