యాదగిరిగుట్ట, మే 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. సోమవారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణతంతు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణతంతును వీక్షించారు. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులను అర్చించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. అనుబంధ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయంలో పరమశివుడు, స్పటిక లింగేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.28,32,433 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.
స్వామివారిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. సోమవారం గొంగిడి మహేందర్రెడ్డి జన్మదినం కావడంతో వారు స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చక బృందం వేద ఆశీర్వచనం చేయగా అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గొంగిడి మహేందర్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.