నల్లగొండ, అక్టోబర్ 25 : సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నల్లగొండలో తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా కృషి చేస్తున్నానని, హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసి నల్లగొండను సుందరంగా తీర్చి దిద్దేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని 12, 37, 39 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. నల్లగొండను రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు. పట్టణంలోని వార్డుల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో రూ.1,450 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో మార్పుకోసం తనకు అవకాశం ఇవ్వాలని కోరగా ప్రజలు నమ్మకంతో గెలిపించారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం నల్లగొండను పూర్తిస్థాయిలో అభివృద్ధ్ది చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అవి పూర్తిస్థాయిలో అమలు కావాలంటే రాష్ట్రంలో మళ్లీ సీఎంగా కేసీఆరే రావాలన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టినట్లుగా ఈ సారి అధికారంలోకి రాగానే మార్చి నుంచే ఆసరా పింఛన్ల పెంపుతో పాటు తెల్లకార్డు కలిగిన వారికి ఉచిత బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే తాను కోరుకున్నానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయిలో సాయం చేసినట్లు చెప్పారు.
తనకు ఎలాంటి వ్యాపకాలు లేవని, తన ధ్యాస మొత్తం నల్లగొండ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షమమే ధ్యేయం అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రైతుబంధు సాయం రూ.16వేలు, అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి, గ్యాస్ సిలిండర్ రూ.400కు ఇవ్వడంతో పాటు బీపీఎల్ కుటుంబాలకు రూ.5లక్షల బీమా కల్పిస్తామన్నారు. కాంగ్రేస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలు అమలుకు సాధ్యం కానివన్నారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందిస్తూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆయా కాలనీల్లో ప్రజలు స్వాగతం పలికి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డప్పుల చప్పుళ్లతో ఆయా కాలనీల్లో ప్రచారం కొనసాగింది. బుధవారం మూడు వార్డుల్లో ప్రచారం చేయగా మహిళలు హారతులతో స్వాగతం పలికి, తిలకం దిద్ది మరోసారి మీకే ఓటు వేస్తామని చెప్పారు.
పాత బస్తీ నుంచి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా అదే వార్డుకు చెందిన శ్రీనివాసచారి ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం రూ.5వేలు అందించి తమ అభిమానాన్ని చాటారు. మీరు మరోసారి గెలిచి నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, అందుకే ప్రచారంలో భాగస్వాములయ్యేందుకే తాను డబ్బులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అభిమన్యు శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, మాలె శరణ్యారెడ్డి, యామ దయాకర్, రావుల శ్రీనివాస్రెడ్డి, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.