సూర్యాపేట, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ‘సూర్యాపేటలో మూడు సార్లు ప్రజల చేతిలో తిరస్కరించబడ్డ రాంరెడ్డి దామోదర్రెడ్డి తన బుద్ధి మార్చుకోలేదు… తిరస్కరణకు కారణాలు తెలుసుకోవడం లేదు.. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు చేరువలో ఉండి సేవ చేస్తే మంచిది.. ఘర్షణలు, దాడులు తగవు.. దౌర్జన్యాలు మితిమీరితే ప్రజలు తిరుగబడతారు.. సూర్యాపేట ప్రజలు ఎంతో చైతన్యవంతులు, నిజాం నిరంకుశత్వంపైనే ఇక్కడి వ్యాపారులు తిరుగబడ్డ చరిత్ర ఉంది… నిజాం కంటే నీవు శక్తివంతుడివేం కాదు’ అని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ‘అరాచకాల దారి నుంచి మారుతూ మీ అనుచరులు, మీ పార్టీ వారిని మార్చాలని’ సూచించారు. కౌన్సిలర్ పావనీకృపాకర్ నివాసం వద్ద కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ చేసిన దౌర్జన్యం, దాడుల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి హుటాహుటిన ఆదివారం సాయంత్రం సూర్యాపేటకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వస్తున్న సమాచారంతో స్వచ్ఛందంగా వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి విద్యానగర్లోని పావనీకృపాకర్ నివాసం వరకు ఆ మూడు పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. గండూరి పావనీకృపాకర్కు అండగా ఉంటామంటూ ధీమా కల్పించారు. కాగా జగదీశ్రెడ్డి అక్కడకు చేరుకొని వారిని పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని, వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రధానంగా రాజకీయాల్లో ఉండే వారికి ఎంతో అవసరమన్నారు. బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఇతర పార్టీలకు వెళ్లారని, అలాగని వారిపై తాను ఎలాంటి కక్ష పెంచుకోలేదని తెలిపారు. గత పదేండ్లుగా సూర్యాపేట ఎంతో ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధిలో దూసుకుపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నందున చేతనైతే మరిన్ని నిధులు తెచ్చి సూర్యాపేట అభివృద్ధిని కొనసాగించాలి తప్ప దౌర్జన్యాలు, కక్షలు సరికాదని రాంరెడ్డి దామోదర్రెడ్డికి సూచించారు. మళ్లీ దౌర్జన్యాలకు పాల్పడి
సూర్యాపేట బ్రాండ్ ఇమేజ్ను తగ్గించవద్దని హితవుపలికారు. పావనీకృపాకర్ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి ఎవరో ఏదో మాయమాటలు చెబితే పార్టీ మారారని తానుగానీ, తన పార్టీ కేడర్గానీ ఒక్కసారి కూడా విమర్శలు చేసిన దాఖలాలు లేవన్నారు. అసలు 32 మంది అవిశ్వాస తీర్మానంపై సంతకం చేస్తే ఒక్కరు కూడా రాలేదని, మరి చైర్మన్పై అసంతృప్తి ఉంటే ఎందుకు వచ్చి సమావేశంలో వ్యక్తపర్చలేదో వారికే తెలియాలని చెప్పారు. ఇకనైనా దాడులు, దౌర్జన్యాలకు స్వస్తి పలుకాలని కోరారు.