చౌటుప్పల్ రూరల్, డిసెంబర్15 : అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేసింది. తాజాగా జనవరిలో రెండో విడుత పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సంబంధిత అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే శిబిరాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ముందుకెళ్తున్నారు.
జిల్లాలో 1.88 లక్షల కుటుంబాలు, సుమారు 7.70 లక్షల జనాభా ఉంది. ఇందులో సగటున ఇంటికొకరు కంటి సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఆయా దవాఖానల సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఉన్న 421 గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి విడుతలో కేవలం 18 బృందాలు కంటి వెలుగులో పనిచేశాయి. 3,79,901 మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో 1.29 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సారి రెండో విడుతలో సేవలు విస్తృతం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 34 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి అద్దాలు అందజేస్తారు. వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన ఖర్చులు కూడా ప్రభుత్వం భరించనున్నది.
రెండో విడుత కంటి వెలుగుకు 34 బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. 18ఏండ్లు పైబడిన వారికి పరీక్షలు చేస్తాం. అవరమైన వారికి అద్దాలు కూడా అందజేస్తాం. 100 పని దినాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాం.
-మల్లికార్జున్రావు, డీఎంహెచ్ఓ