NEET paper leak : నీట్ పేపర్ లీక్ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. తాజాగా పాట్నాలో పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన చేపట్టగా అది హింసాత్మకంగా మారింది. పోలీసులు, విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటన బిహార్ రాజధాని పాట్నాలో బుధవారం జరిగింది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ పాట్నాలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్కు చెందిన అనుబంధ విద్యాసంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
విద్యార్థులు స్థానిక గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరారు. ఈ క్రమంలో గవర్నర్ నివాసానికి మూడు కిలోమీటర్ల దూరంలో విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ మైదాన్ సమీపంలోని జేపీ గోలంబర్ వద్ద బారికెడ్లు పెట్టి విద్యార్థుల్ని ఆపేశారు. ర్యాలీ విరమించుకోవాలని విద్యార్థులకు పోలీసులు సూచించారు. అయినప్పటికీ వినిపించుకోని విద్యార్థులు రాజ్భవన్ ముట్టడికి బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు ఘర్షణ చెలరేగింది. విద్యార్థుల్ని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. అయినా కూడా మరికొందరు విద్యార్థులు డాక్ బంగళా చౌరాహా వద్ద ఆందోళన చేశారు.
దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో అదనపు బలగాలు రంగంలోకి దిగి విద్యార్థులపై విరుచుకుపడ్డారు. లాఠీఛార్జి చేశారు. ఇదే సమయంలో కొందరు ఆందోళనకారులు పోలీసులు, మీడియాపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీసులతోపాటు రిపోర్టర్లకు కూడా గాయలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇదే నీట్ అంశంపై ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి.