నీలగిరి, సెప్టెంబర్ 08 : కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బానాయిస్తున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పోలీసులు చట్టాన్ని అతిక్రమించి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ ఏకపక్షంగా బీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండ టూ టౌన్ పోలీసుల తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. అక్రమ కేసులపై సోమవారం నల్లగొండ డీఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా నిన్న రాత్రి జరిగిన చిన్న గలాటాతో ఘర్షణ పడ్డ ఇరువర్గాల వారు ఎవరికి వారు సమదాయించుకుని వెళ్లిపోయారు. కాగా టూ టౌన్ సీఐ, ఎస్ఐ.. నార్కట్పల్లికి చెందిన మట్టిపల్లి మణికంఠను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వారు తాము కేసు పెట్టం అన్నా వినకుండా, బెదిరించి వారిచేత రాత్రి 12 గంటల సమయంలో బలవంతంగా పిటిషన్ రాయించుకున్నట్లు తెలిపారు.
నల్లగొండకు చెందిన బబ్లు, తదితరులపై కేసు పెట్టి వారిని రాత్రి నుండి పోలీస్ స్టేషన్ లాకప్ లో పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్ర హింసలకు గురి చేస్తున్నారన్నారు. ఇందులో బబ్లు అన్న కాంగ్రెస్ పార్టీ అని అతడిని వెంటనే విడిచిపెట్టినట్లు తెలిపారు. ఇదేమి విధానమని కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు కోసం నల్లగొండ టూ టౌన్ పోలీసులు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే అతడిని విడిచిపెట్టి, వారిపై పెట్టిన కేసును వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న పట్టణంలోని జరిగిన ఒకటో నంబర్ గణేష్ నిమజ్జోత్సవ కార్యక్రమంలో కూడా టూ టౌన్ సీఐ మితిమీరి ప్రవర్తించారన్నారు. విగ్రహ దాతగా వారి ఆహ్వానం మేరకు తాను అక్కడికి వెళితే తనను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాడని, ఇలాంటి పోలీసుల వల్ల డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు రావడమే కాకుండా, ప్రశాంతంగా ఉన్న పట్టణంలో గొడవల సృష్టికి మూలం అవుతున్నట్లు తెలిపారు.
ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే పోలీసులు ఈ విధంగానే కాంగ్రెస్ ఏకపక్ష వ్యవహార శైలి మానుకోకుంటే ప్రజల తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని కంచర్ల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పార్టీ మందడి సైదిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ, నల్లగొండ మండల అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, గుండెబోయిన జంగయ్య, మామిడి పద్మ, కంచర్ల విజయ రవిచంద్ర, అనిల్ పాల్గొన్నారు.