– ఎంజీయూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల హెచ్చరిక
రామగిరి, జూన్ 26 : నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమ ఔట్ సోర్సింగ్ నియామకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ఎంజీయూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల ( ఎం ఎస్ ఎఫ్, పి డి ఎస్ యు, ఎస్ ఎఫ్ఐ) నాయకులు హెచ్చరించారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, యూనివర్సిటీల అభివృద్ధి, విద్యార్థులు, నిరుద్యోగుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఎంజీయూలో ఇటీవల జరిగిన అవుట్సోర్సింగ్ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, దీనివల్ల మాదిగ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని నాయకులు ఆరోపించారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ నిబంధనలు సక్రమంగా అమలయ్యాయా లేదా అనే అంశంపై ప్రభుత్వం ఒక స్వతంత్ర సంస్థతో పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా మా గోడును పట్టించుకునే వారే కరువయ్యారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్వయంగా స్పందించి విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని, సీఎం పర్యటనలో స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు.
జిల్లా పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, ఖాళీ పోస్టుల భర్తీ, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గనుక ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపట్టి సీఎం పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు మాచర్ల సుధీర్ మాదిగ, పీడీఎస్యూ నాయకుడు హర్షవర్ధన్, ఎస్ఎఫ్ఐ నాయకులు కర్రెం రవికుమార్, వంశీ, విగ్నేష్, వైష్ణవ్, సురేష్, కిరణ్ పాల్గొన్నారు.