హుజూర్నగర్, జూన్ 19 : శనివారం జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్లో ముందస్తుగా శుక్రవారం రోజు న్యాయమూర్తుల ఎదుట ఒక జంట తమ పిల్లలతో సహా ఒక్కటయ్యారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బోజ్యతండాకు చెందిన భూక్య కవితకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురానికి చెందిన భూక్య లక్ష్మీనరసింహతో 2019లో వివాహం జరిగింది. వారికి శరణ్య, శ్రీకర్ నాయక్ జన్మించారు. 05 సంవత్సరాల పాటు సజావుగా సాగిన వీరి కాపురం తదుపరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి విడిపోయారు. గత రెండు సంవత్సరాలుగా వీరిరువురు విడివిడిగా జీవిస్తున్నారు. తనకు విడి కాగితాలు మంజూరు చేయమని కోరుతూ లక్ష్మీనరసింహ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విడాకుల కేసు కవితపై దాఖలు చేశాడు. కేసు విచారణలో ఉన్నది.
ఇంతలో లోక్ అదాలత్ రావడంతో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శివరామ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి నక్కా శ్యాంసుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ చొరవ తీసుకుని దంపతులు ఇరువురితో ముఖాముఖి మాట్లాడి వారికి నచ్చజెప్పగా వారు ఇరువురు తిరిగి కలిసి సంసారం కొనసాగించడానికి అంగీకరించి వారి పిల్లల యుక్తముగా నేడు కేసును రాజీ చేసుకుని కలిసిపోయారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వారి చేత ఒకరి చేత ఒకరికి పూలదండలు మార్పించి శుభాకాంక్షలు తెలిపి జంటను కలిపారు. వారి ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి వారి వారి న్యాయవాదులు బానోతు సురేష్ కుమార్, కొణతం శ్రీనివాస రెడ్డి తమ సహాయాన్ని అందించారు.