గట్టుప్పల్, అక్టోబర్ 28 : పేద, మధ్యతరగతి కుటుం బాలపై పెనుభారం మోపేలా పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్న మోదీ ప్రభుత్వంపై యువత తిరుగబడింది. గట్టుప్పల్ మండల కేంద్రంలో శుక్రవారం ద్విచక్ర వాహనాలతో పెట్రోల్ బంక్ నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంధన ధరలు తగ్గించాలని, మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్వామి వివేకానంద చౌరస్తాలో బైక్కు పాడెకట్టి శవయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవీరామ్మోహన్రావు, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ సర్పంచ్ ఇడెం రోజాతో కలిసి పలువురు మాట్లాడారు. రూ.40, 60 ఉన్న డీజిల్, పెట్రోల్ ధరలు విడుతలు వారీగా పెంచుతూ ప్రస్తుతం రూ.100, 110కి చేరువ చేశారన్నారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారిందన్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్తోపాటు గ్యాస్ ధరలు తగ్గించి మునుగోడులో తిరుగాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. బీజేపీ నేతలు స్వార్థ రాజకీయాల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అందులో రాజగోపాల్రెడ్డిని సైతం భాగస్వామిని చేశారని, ఉప ఎన్నికలో ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కార్యక్రమంలో ఇడెం కైలాసం, మండల మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
చౌటుప్పల్, అక్టోబర్ 28 : పెట్రోల్, డీజిల్ ధరలపై యువత భగ్గుమంది. పట్టణంలో శుక్రవారం యువకులు బైకులకు తాళ్లు కట్టి లాగి తెలిపారు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో జనంపై తీవ్ర భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను మానసిక వేదనకు గురిచేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులుండవని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మద్దతు తెలిపారు.
పెంచిన పెట్రోల్ రేట్లు తగ్గించాలి
నాంపల్లి అక్టోబర్ 28 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని నాంపల్లి మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన 300 మంది బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. చేతగాని ప్రధాని మోదీ దిగిపో అని నినాదాలు చేశారు.