మునుగోడు నియోజకవర్గంలో చేనేత కార్మికుల పోస్టుకార్డుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నది. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో నేతన్నలు కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని కోరుతూ నేతన్నలంతా సమష్టిగా ప్రధాని మోదీకి ఉత్తరాలు రాస్తున్నారు. శుక్రవారం మునుగోడు, చౌటుప్పల్, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపూర్ తదితర మండలాల్లో చేనేత కుటుంబాలు భారీ ర్యాలీలు తీశాయి. జీఎస్టీని ఉపసంహరించుకోవాలని చేనేత కార్మికులు డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం ఏమిటని మండిపడ్డారు. జీఎస్టీని రద్దు చేయకపోతే ఉప ఎన్నికలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై జీఎస్టీ రద్దుపై ఉమ్మడి
నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోస్టుకార్డుల ఉద్యమం కొనసాగుతున్నది. శుక్రవారం టీఆర్ఎస్ శ్రేణులు, చేనేత కార్మికులు ఆందోళన చేశారు. ప్రధాని మోదీకి పెద్ద సంఖ్యలో పోస్టుకార్డులు పంపారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. జీఎస్టీని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం ఏమిటని మండిపడ్డారు.
చేనేతను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ
చౌటుప్పల్, అక్టోబర్ 28 : చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే సంజయ్కుమార్, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుంచి మార్కండేయనగర్లోని పోస్టాఫీసు వరకు ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. చేనేత వస్ర్తాలు, ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయాలని పోస్టు కార్డులు రాసిప్రధాని మోదీకి పంపారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ పథకాలైన హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్, పవర్లూమ్ బోర్డులను కేంద్రం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చేనేతపై పన్ను వేసిన మొదటి ప్రధానిగా మోదీ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల రద్దుల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. చేనేత రంగంపై జీఎస్టీని తగ్గించే వరకూ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం, కౌన్సిలర్లు, నాయకులు తాడూరి శిరీషాపరమేశ్, అరుణాబాలకృష్ణ, తిరందాసు ధనుంజయ, గుర్రం నర్సింహులు, స్వామి, మోహన్రెడ్డి, నరసింహ, ముత్యాల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
రాజుపేటతండాలో భారీ ర్యాలీ
మర్రిగూడ, అక్టోబర్ 28 : మండలంలోని రాజుపేటతండా గ్రామపంచాయతీ పరిధి ఆశాపూరితండా, పద్మశాలికాలనీ చౌరస్తాల్లో శుక్రవారం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. చేనేతపై జీఎస్టీ డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు పోస్టు కార్డులను ప్రదర్శించారు. అనంతరం మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నున్సావత్ సక్కుబాయి, మాజీ ఎంపీటీసీ మారగోని రామన్న యాదవ్, నాయకులు బిచ్చునాయక్, వెంకటయ్య యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు జంపాల జయప్రసాద్, కేశగోని రామచంద్రం గౌడ్, యూత్ ఉపాధ్యక్షుడు కుక్కల మహేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కేంద్రం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలి
చేనేతపై పన్నును వెంటనే ఎత్తివేయాలి
వరంగల్ జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు
మునుగోడు, అక్టోబర్ 28 : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత పథకాలను పునరుద్ధరించడంతో పాటు జీఎస్టీని ఎత్తివేయాలని వరంగల్ జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, నల్లగొండ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జెల్లా మార్కండేయ, మునుగోడు చేనేత సహకార డైరెక్టర్ అవ్వారి భాస్కర్ డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీకి ఉత్తరాలు రాసి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జీరో జీఎస్టీ చేయాలని కరోనా తొలి వేవ్ సమయంలో ప్రాంతంలో చేనేత సంఘాలు సుమారు 90రోజులపాటు ఉద్యమం చేశాయన్నారు. ఇది ఉప ఎన్నిక కోసం వచ్చిన ఉద్యమం కాదని తేల్చి చెప్పారు. మునుగోడు చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు సంగిశెట్టి పరమేశ్, కోశాధికారి కోణం జగన్నాథం పాల్గొన్నారు.
జీఎస్టీపై కేంద్రం వెనక్కి తగ్గాల్సిందే
చేనేతకు చేయూతనివ్వాల్సిందే
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 28 : కేంద్రం ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సిందేనని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బోల్ల శివశంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో చేనేత కార్మికులతో కలిసి ప్రధానమంత్రికి ఉత్తరాలు రాసి, పోస్ట్ బాక్స్లో వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చేనేత ముడిసరుకులు, చేనేత వస్ర్తాలపై ఎవరూ విధించలేదని, మోదీ సర్కారు మాత్రం చేనేత కార్మికులపై జీఎస్టీ భారం మోపుతున్నదని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ప్రాంత చేనేత కార్మికులపైపెను భారం పడుతున్నదన్నారు. చేనేత వస్ర్తాల ధరలు పెరిగి డిమాండ్ తగ్గే అవకాశం ఉన్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.