యాదాద్రి, డిసెంబర్ 5 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవను అర్చకులు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో కల్యాణమూర్తులైన స్వామి, అమ్మవార్లను ద్యివ మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు సేవను కొనసాగించారు. తూర్పునకు అభీష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని తిలకించారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవలో స్వామివారిని మెల్కొలిపారు.
తిరువారాధన జరిపి స్వామి, అమ్మవార్లకు బాలభోగం జరిపారు. స్వయంభూ నారసింహుడికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను గరుఢ, తిరుచ్చి వాహనాలపై వేంచేపు చేసి ఆలయ మాఢవీధుల్లో సేవను ఊరేగించారు. రాత్రి దర్బార్ సేవ, రాత్రి నివేదన, శయనోత్సవం సేవ అత్యంత వైభవంగా సాగింది. స్పటికలింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నరపాటు జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి.
తిరుమంగైయాళ్వారు పురప్పాట్ సేవోత్సవం..
లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో తిరుమంగైయాళ్వారు తిరునక్షత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం రెండవ రోజు ముఖ మండపంలో ఆళ్వారును వెంచేపు చేసి ద్యివ ప్రబంధ పారాయణాలు పఠించారు. సాయంత్రం ఆళ్వారుకు పురప్పాట్ సేవోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మోహనాచార్యులు, పారాయణదారులు, అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న ఏపీ మంత్రి విశ్వరూప్
లక్ష్మీనృసింహుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ సతీసమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురికాగా స్వామివారి దర్శించుకుని ముంబైకి వెళ్లి గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సోమవారం యాదాద్రికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. నారసింహుడి దర్శనానంతరం మంత్రి దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారి వెంకట ప్రసాదరాజు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామివారి దయతో పూర్తి ఆరోగ్యవంతుడిగా వచ్చి నారసింహుడిని దర్శించుకున్నట్లు చెప్పారు. స్వామివారు తనకు పునర్జన్మనిచ్చారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
కొండకింద పార్కింగ్ వద్ద విశ్రాంతి గది..
స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతుల కల్పనపై దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొండకింద పార్కింగ్ వద్ద భక్తులు సేద తీరేందుకు దాతల సహకారంతో కూర్చుని విశ్రాంతి తీసుకునేలా గదిని నిర్మించనున్నారు. భువనగిరికి చెందిన వివేరా గ్రూప్ ఆఫ్ హోటల్ ఎండీ సిద్ధి వెంకట్రెడ్డి సహకారంతో నిర్మించే గదిని సోమవారం ఈఓ ఎన్. గీత భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. స్వామివారిని సుమారు 20 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకుని ఖజానాకు రూ. 39,70,519 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.