యాదగిరిగుట్ట, ఏప్రిల్ 7 : పంచనారసింహుడి దివ్యక్షేత్రం శుక్రవారం భక్తులతో కోలాహలంగా మారింది. వరుస సెలవుల నేపథ్యంలో స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. స్వామి వారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు.
అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా భావించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. సుమారు గంటన్నర పాటు సాగిన వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. లక్ష్మీ అమ్మవారిని అద్దాల మండపంలో విశేష పుష్పాలతో అలంకరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.31,32,172 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. స్వామి వారిని సుమారు 28వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
స్వామి వారి సేవలో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ సభ్యుడు
శ్రీవారి సేవలో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యూనల్ హైదరాబాద్ విభాగం సభ్యుడు సూది రంజన్మిశ్రా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.