బొడ్రాయిబజార్, డిసెంబర్ 9 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తులకు రికార్డు ధరలు పలుకుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే మార్కెట్కు 19,020 బస్తాల ధాన్యం తీసుకురాగా క్వింటాకు రూ.2,641 ధర పలికింది. 31 క్వింటాళ్ల పత్తిని రైతులు తీసుకురాగా రాష్ట్రంలోనే అత్యధికంగా క్వింటాకు రూ.8,309 ధర పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. క్వింటా పత్తికి ఖమ్మంలో రూ.8,300, వరంగల్లో రూ.8,025, పెద్దపల్లిలో రూ.8,264, జమ్మికుంటలో రూ.8,150, కేసముద్రంలో రూ.8,209 పలికింది. మార్కెట్ అధికారులు ఎప్పటికప్పుడు జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లర్లు, ట్రేడర్స్తో మాట్లాడుతూ రైతులకు మంచి ధర పడేలా చూస్తున్నారు.
గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం
పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోకుండా మార్కెట్కు వచ్చి అధిక ధరకు అమ్ముకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండీ ఫసియుద్దీన్ తెలిపారు. నిత్యం వరంగల్, ఖమ్మం, కేసముద్రం మార్కెట్లను సంప్రదిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ధరలు దక్కేలా చూస్తున్నట్లు చెప్పారు.