మునుగోడు, అక్టోబర్ 8 : మండలంలోని దుబ్బకాల్వ-కొరటికల్ గ్రామాల మధ్య వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు ఇబ్బంది కలిగేది. రైతులు పొలాలకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడేవారు. వాగుపై బ్రిడ్జి నిర్మించాలంటూ ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో పాలకులకు మొరపెట్టుకున్న పట్టించుకున్న పాపానపోలేదు. కానీ మునుగోడు ఉప ఎన్నికలో ఈ గ్రామాల్లో పర్యటించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విషయాన్ని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఉప ఎన్నిక ఫలితం తర్వాత మునుగోడు మండలానికి ఇచ్చిన ఒక్కొక్క హమీని నెరవేరుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి దుబ్బకాల్వ-కొరటికల్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం గురించి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి తెలియజేసి నిధులు మంజూరు చేయించారు. వాగుపైన 4/2 కి.మీ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 4.4 కోట్లు మంజూరయ్యాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల మధ్య రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.
అభివృద్ధి పథంలో మునుగోడు…
ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు దాదాపు పూర్తయ్యాయి. బీటీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. నూతన గ్రామపంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేయించారు.
చిరకాల వాంఛ నెరవేరుతున్నది
వాన పడితే వాగు ఉధృతికి పెరిగి దుబ్బకాల్వ-కొరటికల్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి తీవ్ర ఇబ్బంది పడేవాళ్లం. రోజులు తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కష్టాలు తప్పుతాయి. రెండు గ్రామాల చిరకాల వాంఛను నెరవేరుస్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు.
– కొండ కృష్ణయ్య, దుబ్బకాల్వ, మునుగోడు మండలం