నల్లగొండ: జిల్లాలో భారీ వాన బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో చండూరు, మునుగోడు మండలాల్లో పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చండూరు మండలంలోని బంగారిగడ్డ, అంగడిపేట, బోడంగిపర్తి, చండూరు వద్ద వాగులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో చండూరు, హైదరాబాద్ వైపు, చండూరు, మునుగోడు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా శిర్దేపల్లి, గొల్లగూడెం వెళ్లే రోడ్డు పూర్తిగా తెగిపోయింది. మొత్తంగా గట్టుప్పల్, మునుగోడు, నాంపల్లి వైపు నుంచి చండూరుకు రావాల్సిన అన్ని దారులు స్తంభించిపోయాయి. దీంతో నల్లగొండ వైపు మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉంది. చండూరులోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, గుర్రంపోడులో దుర్గామాత ఆలయం పూర్తిగా నీటమునిగాయి. చండూరు మున్సిపాలిటీలోని పలు కాలనీలు నీటమునిగాయి.
ఇక మునుగోడు మండలంలోని కొరటికల్, మునుగోడు మండల కేంద్రంలోని మర్రివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. భారీ వర్షాలు కురవడం వల్ల పత్తి పంటలో నీళ్లు చేరాయని, తెగుళ్ల బారిన పడే అవకాశం ఉందని రైతలు ఆందోళన చెందుతున్నారు. కాగా, చండూరు మండలంలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, నాంపల్లిలో 6.5 సెం.మీ., మర్రిగూడలో 6.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది.