చౌటుప్పల్ రూరల్,డిసెంబర్ 2: మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో వృద్ధురాలు భీమనపల్లి అనంతమ్మ(72)ను హతమార్చి బంగారు అభరణాలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. హత్యకేసు వివరాలను శుక్రవారం డీసీపీ భువనగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో కేసుకు సంబ ంధించి వివరాలు వెల్లడించారు. కొయ్యలగూడేనికి చెందిన రామాంజనేయులు కూతురి పుష్పాలంకరణ ఫంక్షన్కు, పిల్లల చదువులకు అప్పులు చేశాడు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై మద్యానికి బాని య్యాడు. తన చిన్ననాటి స్నేహితుడు భీమనపల్లి బాలకృష్ణ తల్లి అనంతమ్మను హతమార్చి అప్పులు తీర్చాలని పథకం రచించాడు.
ఈనెల 30న సాయంత్రం ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో మద్యం సీసా, బ్లేడు తీసుకొని వెళ్లాడు. ఆమెకు మద్యం తాగించిన అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోసి హతమార్చాడు. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు చైన్, చెవిపోగులు, ముక్కు పుడకలను తీసుకొని పారిపోయాడు. అనంతరం బంగారు చైన్ను అదేగ్రామానికి చెందిన జెల్ల భిక్షపతి వద్దకు తీసుకెళ్లి తన భార్య నగలు అని చెప్పి కుదవబెట్టి డబ్బులు ఇవ్వాలని కోరాడు. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో చైన్ జేబులో పెట్టి రెండు మూడు రోజుల తర్వాత డబ్బులు ఇవ్వాలని వెళ్లిపోయాడు.
మిగిలిన నగలను ఇంట్లో దాచిపెట్టాడు. ఈ క్రమంలో మద్యం తాగి తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతడిని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు చైన్, చెవి పోగులు, ముక్కుపోగు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్రెడ్డి, సీఐ మల్లిఖార్జున్రెడ్డి, ఎస్ఐ పాండు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.