నాంపల్లి, జూన్ 18 : నేడు జరుపుకొంటున్న మంచినీళ్ల పండుగ విలువేంటో గతంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగి కాళ్లు, చేతులు వంకర్లు పోయి జీవచ్ఛవంలా బతికిన వారికి తెలుసని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఎస్డబ్ల్యూ లింగోటం గ్రామంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి నీళ్ల పండుగలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు పడుతున్న బాధలు చూసి చలించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీళ్లు అందిస్తున్నారని తెలిపారు.
దేశంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని తెలిపారు. మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు మర్రిగూడ మండలం చర్లగూడెంలో, నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, అవి పూర్తయితే నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, ఎంపీపీలు ఏడుదొడ్ల శ్వేత, మెండు మోహన్రెడ్డి, పల్లె కళ్యాణి, గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీలు వీరమళ్ల భానుమతి, కర్నాటి వెంకటేశ్, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.