నేరేడుచర్ల, మే 25 : హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యాలయాలు, రైతు వేదికలు, బస్తీ, పల్లె దవాఖానలు ప్రారంభోత్సవం. హుజూర్నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. మఠంపల్లిలో శ్రీకాంతాచారి, తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.
ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్ల పరిశీలన
మఠంపల్లి : మండల కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. స్నేహపూర్వక వాతావరణంలో సమ్మేళనం నిర్వహించేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. ఆత్మీయ సమ్మేళనం అనంతరం మట్టపల్లి నృసింహుడిని మంత్రులు దర్శించుకొనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మిర్యాలగూడలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన
మిర్యాలగూడ, మే 25 : మిర్యాలగూడలోని ఏరియా దవాఖానలో రూ.14కోట్లతో చేపట్టనున్న మరో 100 పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా నియోజకవర్గవ్యాప్తంగా 28 ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ల నిర్మాణానికి రూ.5.60కోట్లను మంజూరు చేయగా వాటి నిర్మాణ పనులకు ప్రారంభించనున్నారు. ముందుగా వేములపల్లి మండలంలో రూ.20లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని, మిర్యాలగూడలోని ఇందిరమ్మ కాలనీలో బస్తీ దవాఖానాను ప్రారంభించనున్నారు. అనంతరం క్యాంపు మైదానంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. మంత్రుల పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఏర్పాట్లను పరిశీలించారు.