భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 25 : రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 8వ జోనల్ స్పోర్ట్స్ మీట్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాపోటీలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే గురుకుల సంఖ్య పెరిగిందన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం ప్రతియేటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను పెంచుతున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ.కిరణ్కుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి ఎన్.రజని, గురుకుల ఉపప్రాంతీయ సమన్వయ అధికారి సీహెచ్.నర్సింహాచారి, కళాశాల ప్రినిపాల్ శ్రీరామ్ శ్రీనివాస్, వివిధ కళాశాల ప్రిన్సిపాళ్లు, పీఈటీలు పాల్గొన్నారు.
నడిగూడెం మండలంలో..
నడిగూడెం మండలంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎనిమిదో జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ పలువురిని ఆకట్టుకుంది.