రాణిస్తున్న బీసీ గురుకులాల విద్యార్థులు
ఆహ్లాదకర వాతావరణంలో కార్పొరేట్ స్థాయి బోధన
ఉమ్మడి జిల్లాలో 26 బీసీ గురుకులాలు
14 విద్యాలయాల్లో పది, ఇంటర్ నిర్వహణ
పదిలో 1,125 మందికి 1,121 మంది విద్యార్థుల ఉత్తీర్ణత
ఇంటర్ ఫస్టియర్లో రాష్ట్ర స్థాయిలో 3, 4, 5 ర్యాంకులు
యాదాద్రి, జూలై 1 : పేద విద్యార్థులకు విద్యతోపాటు భోజన వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో నాణ్యమైన బోధనతోపాటు ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారు. ఇటీవల విడుదలైన పది, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఉమ్మడి జిల్లాలో 26 బీసీ గురుకులాలు ఉండగా అప్గ్రేడ్ చేస్తూ 2021-22 సంవత్సరంలో 14 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రారంభించారు. 1,117 మంది విద్యార్థుల్లో 992 మంది ఉత్తీర్ణత పొందగా రాష్ట్ర స్థాయిలో పలువురు 3, 4, 5 ర్యాంకులు సాధించారు.
టెన్త్ ఫలితాల్లో 1,125 విద్యార్థుల్లో 1,121 మంది ఉత్తీర్ణత పొందగా 71 మంది 10 జీపీఏ సాధించారు. ఒత్తిడి లేని చదువు, ఆహ్లాదకర వాతావరణం, వెన్నుతట్టి ప్రోత్సహించే ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది. జీవితంలో ఎందులోనైనా రాణించేలా మనోధైర్యం లభిస్తున్నది.
విద్యాపరంగా వెనుకబడిన గ్రామీణ బీసీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యనందించేందుకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల వసతి గృహ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. సర్కార్ బడులు, సాధారణ గురుకులాల్లో బోధించే పద్ధతులకు భిన్నంగా బీసీ గురుకులాల్లో వినూత్న విధానాలు అమలవుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి బాలుర, బాలికల విభాగాలు కలిపి 2 చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి ప్రతిభా పాటవాలను గుర్తించి, వాటిని సానబెట్టే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 26 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయగా.. 14 గురుకులాల్లో పదో తరగతి వరకు విద్య అందిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో గతేడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తరగతులను ప్రారంభించారు.
ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 బీసీ గురుకులాల్లో 2021-22 సంవత్సరంలో ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించారు. తొలి ఏడాది 1,117 మంది విద్యార్థులు ఫస్టియర్ పరీక్షలు రాయగా.. 992 మంది (88.81 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలోనే పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి బీసీ గురుకుల పాఠశాలకు చెందిన మలమంతి పావని బైపీసీలో రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు సాధించింది. తుమ్మడం పాఠశాలకు చెందిన ఐశ్వర్య, దామరచర్ల పాఠశాలకు చెందిన నంద్యాల అఖిల, భూపతి మేఘన, మంగళపల్లి మేఘన 4వ ర్యాంకు సాధించారు. ఎంపీసీలో ఎం.హారిక (మునుగోడు), జి.శ్రీదివ్య (చందుపట్ల), వంశీ (కనగల్), నిహారిక (అనంతగిరి) 4వ ర్యాంకు సాధించారు. వీరితోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రూప్లను కలుపుకొని పది మంది 5వ ర్యాంకు, మరో 10 మంది 6వ, తొమ్మిది మంది 7వ, 18 మంది 8వ, పది మంది 9వ, 19 మంది విద్యార్థులు 10వ ర్యాంకు సాధించారు.
బోధనా పద్ధతులు వినూత్నం..
విద్యార్థులను దత్తత తీసుకొని బోధన..
గురుకుల పాఠశాలల్లో బోధనా పద్ధతిపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను గుర్తిస్తున్నారు. చదువులో అత్యంత వెనుకబడిన వారిపై ఉపాధ్యాయ బృందం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఒక్కో ఉపాధ్యాయురాలు ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను దత్తత తీసుకుని వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి బోధిస్తున్నారు. ఈ పద్ధతితో చదువులో వెనుకబడిన విద్యార్థులు సైతం రాణిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు పది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.
శారీరక దృఢత్వం, మానసిక వికాసం..
గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి నిత్యం యోగా, ధ్యానం, వ్యాయామం చేయిస్తున్నారు. ఆటలు ఆడిస్తారు. ఉదయం 5:15 నుంచి 6గంటల వరకు వ్యాయామం, యోగా చేయిస్తున్నారు. సాయంత్రం 4:30 నుంచి 5:45 గంటల వరకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షాట్ పుట్, లాంగ్ జంప్, స్కిప్పింగ్, షటిల్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడిస్తున్నారు.
వ్యవసాయాధికారి అవుతా..
మాది బీబీనగర్. మా నాన్న రోజువారి కూలీగా పనిచేస్తారు. నేను రెండేండ్ల క్రితం మోటకొండూర్ బీసీ గురుకులంలో చేరా. ఇక్కడ బోధన చాలా బాగుంది. ఉపాధ్యాయులు మంచిగా చెప్తున్నారు. రకరకాల పుస్తకాలు, యూనిఫాం, షూ ఉచితంగా ఇస్తున్నారు. దాంతో ఇంటర్మీడియట్ ఫస్టియర్ బైపీసీలో రాష్ట్రంలోనే 6వ ర్యాంకు సాధించాను. మా ఊరిలో చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులను స్వయంగా చూశాను. రైతులకు అండగా ఉండాలనుకుంటున్నా. ప్రభుత్వ ప్రోత్సాహం, టీచర్లు చెబుతున్న పాఠాలను శ్రద్ధగా విని వ్యవసాయాధికారి కావాలని ఉంది. – బి.పావని, బైపీసీ ఫస్టియర్ రాష్ట్ర 6వ ర్యాంకు
లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక శిక్షణ
గురుకులాల్లో చేరిన విద్యార్థుల అభిరుచులు, ఆసక్తిని అడిగి తెలుసుకుంటాం. వారిలో దాగిఉన్న ప్రతిభను వివిధ పద్ధతుల ద్వారా గుర్తిస్తాం. వారి లక్ష్యాలు సాధించేందుకు శిక్షణ ఇస్తాం. పాఠశాలలో నమూనా ఇంటర్వ్యూలు, చర్చావేదికలు, సెమినార్స్ నిర్వహిస్తాం. రోజూ ఒక అంశంపై నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి విద్యార్థి పాల్గొనేలా ప్రోత్సహిస్తాం. విద్యార్థి కేంద్రంగా బోధన ప్రయోగాత్మకంగా ఉంటుంది. – జ్యోతి, మోటకొండూర్ బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య
మాది రామన్నపేట. మాకు ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. పెద్దమ్మాయి శివాని. నేను ఊర్లో హార్వెస్టర్, డోజర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నా. నెలకు రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు వస్తాయి. పిల్లలు మంచిగా చదువుకోవాలని ప్రైవేట్ స్కూళ్లల్లో చేర్పించి లక్షలు ఖర్చు చేశాం. అయినా నా బిడ్డకు చదువు సరిగా రాలేదు. మోటకొండూర్ బాలికల బీసీ గురుకుల హాస్టల్లో చేర్పించా. ఇప్పుడు పదో తరగతిలో 10జీపీఏ సాధించింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంత నాణ్యమైన చదువు అందిస్తున్న ప్రభుత్వానికి, పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.
– కందుల కృష్ణ, భాగ్యమ్మ, విద్యార్థిని తల్లిదండ్రులు, రామన్నపేట
చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉమ్మడి జిల్లాలోని 26 బీసీ గురుకులాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యమిస్తాం. మంచి భోజనం, చక్కటి వసతులతో అంకితభావం గల ఉపాధ్యాయులతో ప్రభుత్వం 2017లో గురుకులాలను స్థాపించింది. వాటి లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించేందుకు విజిలెన్స్ విభాగం పాఠశాలను సందర్శిస్తుంది.
– ఎం.షకీనా, ప్రాంతీయ సమన్వయ అధికారి, బీసీ గురుకుల విద్యాలయ సంస్థ, ఉమ్మడి నల్లగొండ