ఆహ్లాదకరంగా హరితహారం చెట్లు
ఆత్మకూరు(ఎం), మే 22 : ప్రతి పల్లెను హరిత గ్రామాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం 3వ విడుతలో భాగంగా మండలంలోని ప్రధాన రోడ్ల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం పంచుతున్నాయి. రోడ్డు వెంట వెళ్లే ప్రజలు, వాహనదారులకు నీడనిస్తూ ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.
మండలంలోని కూరెళ్ల గ్రామం నుంచి పుల్లాయిగూడెం వెళ్లే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా 250 మొక్కలు నాటి సంరక్షించగా.. ఏపుగా పెరిగి అల్లుకుపోయాయి. సిద్ధ్దాపురం నుంచి పల్లెర్లకు వేళ్లే రోడ్డు వెంట 250 కొరటికల్కు వెళ్లే రోడ్డు వెంట 150, రహీంఖాన్పేట రోడ్డు వెంట 120, కూరెళ్ల నుంచి రహీంఖాన్పేట రోడ్డు వద్దకు వెళ్లే దారి పొడవునా వంద మొక్కలు నాటారు. నేడు అవి పెద్దవై పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. వేసవిలో రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికులు చెట్ల కింద కాసేపు సేద దీరుతున్నారు. గ్రామాల్లో రోడ్ల వెంట ఉన్న పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉందని, రోడ్డు వెంట వెళ్తున్నప్పుడు చెట్లు స్వాగతం పలుకుతున్నట్లు ఉన్నదని మండల ప్రజలు, వాహనదారులు పేర్కొంటున్నారు.
హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల వెంట, ప్రభుత్వ స్థలాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపై ఉన్నదని ఎంపీడీఓ ఆవుల రాములు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో నీడనిచ్చే మొక్కలతోపాటు పూలు, పండ్ల మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను సంరక్షించేందుకు వన సంరక్షకులను నియమించామని, దాతల సహకారంతో ట్రీగార్డులను ఏర్పాటు చేసి సంరక్షించడంతో నేడు ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయని ఏపీఓ బొడిగె రమేశ్ పేర్కొన్నారు.