ఏపుగా పెరిగిన చెట్లు.. నేలపై పరుచుకున్న పచ్చని గడ్డి.. వెరసి పార్కులను తలపిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి సూర్యాపేట పట్టణంలోని డంప్ యార్డులు. హరితహారంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారి చిట్టడవిని తలపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమునానగర్, బాలెంల డంపింగ్ యార్డుల్లో పెద్ద సంఖ్యలో నాటిన మొక్కలు నేడు ఆకుపచ్చ వనాలుగా దర్శనమిస్తున్నాయి.
డంపింగ్యార్డు అంటే చెత్తకుప్పలు.. కంపుకొట్టే పరిసరాలు.. చూస్తేనే ఒళ్లు జలదరించేలా పరిసరాలు గుర్తుకు వస్తాయి.. కానీ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డంపింగ్యార్డులో మాత్రం ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు, నేలపై పరుపులా పేర్చిన పచ్చనిగడ్డి.. ఆహ్లాదాన్ని పంచే వాతావరణంతో పార్కును తలపించేలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమునా నగర్, బాలెంల వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటితే అవి పెరిగి మహా వృక్షాలుగా మారి అడవిని తలపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆరేండ్ల క్రితం జమునానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంపింగ్యార్డులో, మూడేండ్ల క్రితం బాలెంల వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా వేలాది మొక్కలు నాటారు. సదరు మొక్కలు నేడు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. ఆయా డంపింగ్ యార్డుల్లో చెత్తను ఎప్పటి కప్పుడు సెగ్రిగేషన్ చేయడంతో పాటు ఎరువులను తయారు చేస్తుండడంతో దుర్వాసన లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా దర్శన మిస్తున్నాయి. దీనికి తోడు మొక్కలు ఏపుగా పెరగడంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తున్నది. మున్సిపల్ పాలకవర్గం, సిబ్బంది కృషితో డంపింగ్యార్డు పచ్చని పార్కుగా మారడంతో పరిసర ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక నిర్వహించిన హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం వేలాది మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు అనేది చూడకుండా అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా మారిన అటవీ భూములు హరితహారం కార్యక్రమం ద్వారా నేడు మొక్కలు పెరిగి పచ్చగా దర్శనమిస్తున్నాయి. దాంతో పాటు జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లు, అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో నేడు అవి ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. 2014కు ముందు జిల్లాలో అటవీప్రాంతం ఒక శాతం కూడా లేకపోగా హరితహారం ద్వారా నాటిన మొక్కలు, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుతో నేడు 11 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.