ఆర్టీసీని పూర్వస్థితికి తీసుకురావడానికి ఆ సంస్థ అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నది. ఆదాయం పెంచి నష్టాల నుంచి లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగుతున్నది. ఇప్పటికే కార్గోను ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. మహిళలు, సీనియర్ సిటిజన్స్ను దృష్టిలో పెట్టుకొని టీ9 టికెట్ను తీసుకొచ్చింది. కొత్తగా పట్టణ వాసులకు పల్లెవెలుగు బస్సుల్లో టౌన్ బస్పాస్ను ప్రవేశపెట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం టీ9 టికెట్ను 60 కిలోమీటర్లతోపాటు 30 కిలోమీటర్ల వరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులను ఆకర్షించడంతోపాటు వారికి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
– నల్లగొండ సిటీ, జూలై 30
నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు భారం తగ్గించేందుకు పల్లె వెలుగు టౌన్ బస్పాస్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రం నుంచి 5 కి.మీ. అపరిమితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. దీనికిగాను నెలకు రూ.500 చెల్లించి పట్టణంలో ప్రయాణించేందుకు అవకాశం ఉంది. పట్టణంలోని పానగల్, మర్రిగూడ, ఎల్లమ్మగుడి, కలెక్టరేట్, కొత్తపల్లి వరకు ప్రయాణించవచ్చు.
గత నెల 18నుంచి పల్లె వెలుగు బస్సుల్లో టీ-9 టికెట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నల్లగొండ రీజియన్ పరిధిలో 7 డిపోలు ఉండగా 42 రోజుల్లో 11,196 మంది టీ-9 టికెట్లను కొనుగోలు చేశారు. వీటిలో అత్యధికంగా మిర్యాలగూడ డిపో నుంచి 4,286 టికెట్లను కొనుగోలు చేయగా, నల్లగొండ డిపో నుంచి 1,730, దేవరకొండ – 1,218, యాదగిరిగుట్ట-1,630, సూర్యాపేట – 1,607, కోదాడ – 432, నార్కట్పల్లి డిపో నుంచి 293 టికెట్లను కొనుగోలు చేశారు.
ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన టీ-9 టికెట్ను పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ టికెట్ను మహిళలు, సీనియర్ సిటిజన్స్కే కాకుండా పురుషులకు కూడా వర్తింపజేస్తున్నారు. దీని ద్వారా వంద రూపాయలు చెల్లించి ఉదయం 9నుంచి రాత్రి 9గంటల వరకు 60 కిలోమీటర్ల వరకు రాను పోను ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అయితే.. రాను పోను ఒక్కసారి మాత్రమే వినియోగించాలి. అదే తరహాలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వారి కోసం టీ9 (30) టికెట్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టికెట్ ద్వారా రూ.50 చెల్లించి 30 కిలోమీటర్ల వరకు రాను పోను ప్రయాణించవచ్చు. దీని ద్వారా ఒక్కొక్కరికి 10 నుంచి 30 వరకు ఆదా కానున్నది.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వ సూచన మేరకు టీ-9 టికెట్ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. నల్లగొండ పట్టణ పరిధిలో రూ.500 చెల్లించి 5 కి.మీ. వరకు ఎన్ని సార్లయినా ప్రయాణించవచ్చు.
– ఆర్ఎం శ్రీదేవి