నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన ఐటీ హబ్లో కొలువులు భర్తీ చేసేందుకు శుక్రవారం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే గాక మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి దాదాపు 15,316 మంది అభ్యర్థులు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈ జాబ్మేళాను ప్రారంభించి ఆయా కంపెనీల ప్రతినిధులు, హాజరైన యువతతో మాట్లాడి వెళ్లారు. అనంతరం ఐటీ టవర్లో ఉద్యోగాల కల్పనకు తొలి దశలో 13 కంపెనీలు రాగా వివిధ విభాగాల్లో పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలకు తొలి దశలో 350 మందిని ఎంపిక చేశారు. ఉద్యోగాలకు ఎక్కువగా బీటెక్, ఎంబీఏ, డిగ్రీ పూర్తి చేసిన వారు పోటీపడ్డారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభ్యర్థులతో జాబ్ మేళా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఉద్యోగార్థులకు ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భోజనంతోపాటు మౌలిక వసతులు కల్పించారు.
నల్లగొండ యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు టాస్క్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనకున్నదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉండే సాఫ్ట్వేర్ కొలువులు టైర్ టూ సిటీల్లో ఒకటైన నల్లగొండకు రావడంతో నిరుద్యోగుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో జాబ్ మేళా నిర్వహించే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఈ జాబ్మేళాను ప్రారంభించి అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి ఆయా కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఏ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది.. ఉద్యోగులతో ఏం పని చేయిస్తున్నది అడిగి తెలుసుకొని టాస్క్ నిర్వహించే పరీక్ష విధానాన్ని పరిశీలించారు. నల్లగొండ జిల్లాలో పుట్టి పెరిగి అమెరికాలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలకు చెందిన 13 కంపెనీల సహకారంతో టాస్క్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించగా.. 15,316 మంది ఎన్రోల్ చేయించుకున్నారు. వీరిలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ చదివిన వారు తమ అర్హతలకు తగ్గట్టుగా ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకునేందుకు ప్రయత్నం చేశారు. అన్ని పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారిలో తొలి దఫా 350 మందిని ఎంపిక చేసి ఉద్యోగాలు కల్పిస్తూ కంపెనీలు సంబంధిత ఆదేశాలు ఇవ్వనున్నాయి.
అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు
జాబ్ మేళాకు అభ్యర్థులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నదని ముందే ఊహించడంతో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచనతో మున్సిపాలిటీ మౌలిక వసతులు కల్పించింది. అక్కడకు వచ్చిన ప్రతి అభ్యర్థితోపాటు కంపెనీల ప్రతినిధులకు నీటి సౌకర్యం, భోజన వసతి కల్పించారు. శామియానాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో ఒక్కో అభ్యర్థి నాలుగైదు కంపెనీల పరీక్షలు రాసినంత సేపు ఎలాంటి ఇబ్బందీ పడలేదు. నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు రాగా.. వారి వెంట తల్లిదండ్రులు, ఇతర తోబుట్టువులు సైతం వచ్చారు. వారందరికీ అక్కడే భోజన సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఐటీ కొలువుల కోసం జాబ్మేళాలు జరుగలేదని అభ్యర్థులు అంటున్నారు. జాబ్మేళా ప్రారంభోత్సవంలో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రాష్ట్ర ఐటీ హబ్ డిప్యూటీ సీఆర్ఓ శ్రీనివాస్, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, టాస్క్ ప్లేస్మెంట్స్ డైరెక్టర్ ప్రదీప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కమిషనర్ కేవీ రమణాచారి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, 13 కంపెనీల ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అభ్యర్థులు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు జిల్లా కేంద్రంలో రూ.98కోట్లతో ఐటీ హబ్ నిర్మించారు. అందులో ఉద్యోగాలు కల్పించేందుకు శుక్రవారం టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయం తొమ్మిది గంటలకే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో జాబ్మేళా నిర్వహించే ప్రాంగణం కోలాహలంగా మారింది. తొలి దశలో 1,080 ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ జాబ్ మేళా జరుగ్గా.. 15,316 మంది హాజరై తమ పేర్లను ఎన్రోల్ చేసుకున్నారు. అమెరికా ఎన్ఆర్ఐల కంపెనీల్లో మన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ఇక్కడ ఐటీ టవర్ ప్రారంభించిన రోజే వారిని ఒప్పించడంతో దానికి అనుగుణంగా నేడు ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళా నిర్వహించారు.
యువత ఇంత పెద్ద ఎత్తున రావడం సంతోషం కలిగించింది
20 ఏండ్లుగా యువతను మాటలతో మభ్యపెట్టి మోసం చేసిన గత పాలకుల నిర్లక్ష్యంతో నల్లగొండ సర్వ దరిద్రాలు అనుభవించింది. గత ఎన్నికల్లో భూపాల్రెడ్డిని గెలిపిస్తే నల్లగొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే రూ.1300 కోట్లు మంజూరు చేశారు. ఆ డబ్బుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో నల్లగొండ సర్వాంగ సుందరంగా మారుతున్నది. నల్లగొండ జిల్లా విద్యార్థుల కోసం 12 నెలల్లోనే రూ.90 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి చేయించాం. టాస్క్ ద్వారా 13 కంపెనీలతో నిర్వహించిన మెగా జాబ్మేళాకు ఇంత పెద్ద ఎత్తున యువత హాజరు కావడం సంతోషం కల్గించింది. ఈ నెల రెండు లేదా మూడో వారంలో ఐటీ టవర్ను ప్రారంభిస్తాం. మరికొన్ని పెద్ద కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నది. విడుతల వారీగా ఆయా సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
– కంచర్ల భూపాల్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే
కమ్యూనికేషన్స్, టెక్నాలజీపై ఉచిత శిక్షణ ఇస్తాం
అందరూ జన్మదిన వేడుకలకు గిప్టులు తీసుకుంటారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాత్రం నల్లగొండ యువతకు ఐటీ హబ్నే గిప్టుగా ఇచ్చారు. ఆయన కృషి వల్లే నల్లగొండలో ఇంత పెద్ద ఎత్తున ఐటీ హబ్ ఏర్పాటైంది. 13 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించగల్గినం. జాబ్ రానివారు నిరాశ చెందాల్సిన పని లేదు. టాస్క్ ఆధ్వర్యంలో ఐటీ హబ్లోని గ్రౌండ్ ఫ్లోర్లో టెక్నాలజీ, కమ్యూనికేషన్స్పై ఉచిత శిక్షణ ఇచ్చి ఐటీ రంగంలో ఉన్నతమైన ఉద్యోగాలు పొందేలా కృషి చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నల్లగొండలో నిర్వహించిన ఐటీ హబ్ ఉద్యోగ మేళాకు 13,600 మంది అభ్యర్థులు రావడం గొప్ప విషయం.
– శ్రీకాంత్ సిన్హా, టాస్క్ సీఈఓ
ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఇలా..
ఐటీ హబ్లో ఉద్యోగాలు కల్పించేందుకు టాస్క్ తొలుత ప్రకటించిన విధంగానే ఏదైనా డిగ్రీ, బీటెక్, ఎంబీఏలో 2016 నుంచి 2023 వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా టాస్క్ సూచన మేరకు అక్కడికి వచ్చిన 13 కంపెనీలు తమ పేర్లతోపాటు ఆ కంపెనీల్లో ఉద్యోగాలు కావాలంటే ఉండాల్సిన అర్హతలతో ఒక జాబితాను క్యూ ఆర్ కోడ్తో ఉన్న పేపర్ను ప్రతి అభ్యర్థికి ఇచ్చారు. దాంతోపాటు జాబ్ మేళా నిర్వహించే ప్రాంగణంలో ప్రతి కంపెనీ క్యూ ఆర్ కోడ్తో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన అభ్యర్థులు అప్పటికే తీసుకున్న పేపర్ లేదా ఫ్లెక్సీపై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే ఆ మొబైల్కు కంపెనీ యాజమాన్యం లింక్ పంపింది. ఆ లింక్లో టాస్క్ ప్రతినిధులు ప్రాథమిక పరీక్షలో భాగంగా ఆప్టిట్యూడ్, ఇంగ్లిషులో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతర అంశాలకు సంబంధించి 30 మార్కులతో పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష ఆధారంగా ఎంచుకున్న కంపెనీ అదే ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్టాల్ నుంచే వారి ప్రతిభను గుర్తించారు. ప్రతిభ ఆధారంగా సంబంధిత కంపెనీకి ఎంపిక చేసింది టాస్క్. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ హెచ్ఆర్లు ఒకటీ రెండు రౌండ్లలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు.
నైపుణ్యం ఉన్నవారికే ఉద్యోగాలు
బీటెక్ (సీఎస్ఐ, ఐటీ), బీస్సీ, ఎంపీసీ, ఎంఈసీఎస్ పూర్తి చేసిన వారికి మా కంపెనీ తరఫున ఆన్లైన్ టెస్టు నిర్వహించాం. అందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి నైపుణ్యం ఉన్న 25 మందిని సెలెక్ట్ చేశాం. మా కంపెనీలో సెలెక్ట్ అయిన వారి నుంచి ఐటీ సర్వీసులు తీసుకుంటాం. మా కంపెనీ యూఎస్బీఎస్ బేస్డ్ కంపెనీ. 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. దేశ వ్యాప్తంగా మా కంపెనీలో 2వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాలకు ఐటీ హబ్లు ఏర్పాటు చేయడంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారు.
– రవిచంద్ర, స్మార్ట్ ఐఎంఎస్ ఇండియా లిమిటెడ్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్
డేటా సొల్యూషన్స్ కంపెనీకి 75 మందిని తీసుకుంటాం
ఐటీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేయడం సంతోషకరం. నల్లగొండలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందనున్నారు. మా కంపెనీ అమెరికా, డెన్మార్క్, కెనడా, ఇండియాలో ఉన్నది. త్వరలో సౌదీ అరేబియా, సింగపూర్లో నెలకొల్పుతున్నాం. ప్రతిభ ఆధారంగా నల్లగొండ నుంచి 75 మంది అభ్యర్థులను మా కంపెనీలో ఉద్యోగాలకు ఎంపిక
చేయనున్నాం.
– చేతన్, ఎన్ఫ్లోక్స్ డేటా సొల్యూషన్స్, హెచ్ఆర్
ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహించడం సంతోషకరం
తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరించింది. నేను మహబూబాబాద్ నుంచి ఉద్యోగ మేళాకు వచ్చా. 2016లోనే ఎంటెక్ పూర్తి చేశా. స్వయంగా ఇలా ప్రభుత్వమే ఐటీ హబ్లు ఏర్పాటు చేసి ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడకుండా నేరుగా ఉద్యోగ మేళాలు నిర్వహించడం సంతోషకరం.
– నూనె అనూష, మహబూబాబాద్
మేళాకు ఇంత మంది వస్తారనుకోలేదు
నేను ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. నాకు సంవత్సరానికి 7లక్షలా 50వేల ప్యాకేజీ. హైదరాబాద్లో ఉంటున్నా. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంచి ఉద్యోగం వచ్చి, మంచి వేతనం దక్కుతుందేమోనని ఈ ఉద్యోగ మేళాకు వచ్చా. ఈ ఉద్యోగ మేళాకు వేల మంది అభ్యర్థులు వస్తారని ఊహించలేదు.
– సంతోషి, చండూరు