సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 8 : గతంలో సరైన రోడ్లు, సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుక్కెడు నీళ్ల కోసం చెలిమెలు, వాగుల వెంట తిరిగేది. కరెంటు లేకపోవడంతో కట్టెల పొయ్యి వెలుగులో ప్రసవాలు జరిగేవి. తండాలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే మంచం మీద ఎత్తుకొని వాగులు, వంకలు, గుట్టలు దాటుకుంటూ మండల కేంద్రానికి తీసుకొచ్చేవారు. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితులు మారాయి. సీఎం కేసీఆర్ గిరిజన తండాలకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో 15 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి తండాకు మిషన్ భగీరథ నీళ్లు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, హెల్త్ సెంటర్లు, గిరిజన గురుకుల పాఠశాల, గిరిజన భవనం, ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయడంతో గిరిజన తండాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి.
నాడు చెలిమె నీళ్లే దిక్కు.. నేడు ఇంటికే శుద్ధి జలాలు
గతంలో తండా ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం చంటి పిల్లలను ఎత్తుకొని వాగులు, వంకలు దాటుకుంటూ చెలిమెలు, కుంటల వద్దకు వెళ్లేది. తాగు నీరు ఇప్పించాలని తండా ప్రజలు మండల కేంద్రానికి వచ్చి ధర్నాలు చేసేది. నీళ్ల కోసం ఎన్ని పోరాటాలు చేసినా గత పాలకులు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో గిరిజన తండాల్లో నీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రతి తండాలో మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. తండాలో ప్రతి రోజు శుద్ది జలాలు అందిస్తున్నారు. 50 కుటుంబాలు ఉన్న రాచకొండ ప్రాంతంలో గుట్టలపై చిట్ట చివరన ఉండే ఐదు దోనాలతండాలో రూ.2 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ నీళ్లు అందించడం విశేషం. తండాలకు భగీరథ నీళ్లు రావడంతో నీళ్ల గోస తీరిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన గురుకుల పాఠశాల మంజూరు
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మండల కేంద్రంలో గిరిజన గరుకుల పాఠశాల మంజూరు చేస్తామని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఆ మేరకు నారాయణపురం మండల కేంద్రంలో బాలుర గిరిజన గురుకుల పాఠశాలను మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో 5, 6వ తరగతులు నిర్వహిస్తుండగా.. 50మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నది.
రూ.2 కోట్లతో గిరిజన భవనం
హైదరాబాద్లో నిర్మించిన బంజారా భవన్ మాదిరిగా నారాయణపురం మండల కేంద్రంలో గిరిజన భవనం నిర్మాణానికి సీఎం కేసీఆర్ రెండు ఎకరాల స్థలం కేటాయించారు. దాంతోపాటు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేశారు. మండల కేంద్రంలో అనువైన స్థలం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా సొంత నిధులు రూ.10లక్షలతో సంత్ సేవాలాల్ గుడి నిర్మాణం చేస్తానని ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. అందుకు స్థల సేకరణ చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న బీటీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
10 కొత్త గ్రామపంచాయతీ భవనాలు మంజూరు
మండలంలో 24 గిరిజన తండాలు ఉన్నాయి. అవి గతంలో మేజర్ గ్రామ పంచాయతీలకు అవాస గ్రామాలుగా ఉండేవి. దాంతో ప్రతి చిన్న పని కోసం గ్రామ పంచాయతీలకు వెళ్లాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో తండాలను గిరిజనులే పాలించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 15 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 10 గిరిజన గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు కేటాయించారు. అదేవిధంగా ప్రతి తండాకు రూ.25 లక్షలు కేటాయించడంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు.
నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
గిరిజన తండాల అభివృద్ధే ధ్యేయంగా పనులు చేస్తున్నాం. ఎస్టీ గురుకుల పాఠశాల, గిరిజన భవనం, సంత్ సేవాలాల్ గుడి నిర్మాణం, సీసీ రోడ్లతోపాటు ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేశాం. గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం చాలా తృప్తినిచ్చింది. తండాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు.
– ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
గిరిజనులకు అండగా సీఎం కేసీఆర్
గిరిజన తండాల ప్రజలను సీఎం కేసీఆర్ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. మండలంలో 16 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతోపాటు 10 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేశారు. తండాలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేశాం. మా గిరిజన తండాల ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– దేవిలాల్, వాచ్యతండా సర్పంచ్