జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరి ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండగా ఆలోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది. దీంతో గ్రామాల్లో సందడి మొదలైనప్పటికీ రిజర్వేషన్లు మాత్రం ఆశావహులను కలవర
పెడుతున్నాయి. 10 సంవత్సరాలు ఒకే రిజర్వేషన్ ఉండేలా గత ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చగా.
ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు రిజర్వేషన్లు మారుస్తుందనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇప్పటికే లక్షల్లో డబ్బు ఖర్చు చేసిన ఆశావహులు రిజర్వేషన్ ఎలా వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 844 గ్రామ పంచాయతీలు, 7,340 వార్డులు ఉండగా.. అదనంగా 24 గ్రామపంచాయతీలు, 163 వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. వీటిని అమోదిస్తే జిల్లాలో గ్రామ పంచాతీయలు 868కి, వార్డుల సంఖ్య 7,503కి పెరుగనున్నది.
నీలగిరి, డిసెంబర్ 15 : జిల్లాలో స్థానిక ఎన్నికలు చోటా నాయకుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల పదవీ కాలం ఫిబ్రవరి1తో ముగుస్తుండడంతో అలోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది. దీంతో స్థానిక నాయకుల్లో సందడి మొదలైనా రిజర్వేషన్లు వారిని కలవర పెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నూతన పంచాయతీ రాజ్ చట్టం రూపొందించి పదేండ్లు ఒకే రిజర్వేషన్ ఉండేలా రూపకల్పన చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించారు.
కొంతకాలంగా గ్రామాల్లో చోటా నాయకులు అవే రిజర్వేషన్లు అమలవుతాయని భావించచి ఆశావాహులు లక్షల్లో ఖర్చు చేశారు. ఇటీవల నూతన ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో గ్రామాల్లో చోటా నాయకుల్లో రిజర్వేషన్ల అంశం వారిలో గుబులు పుట్టిస్తున్నది. రిజర్వేషన్లు కలిసి వచ్చి సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలవాలన్న ఆశావాహులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల చివరి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారా లేక పాత వాటితోనే సరిపెడతారా అనే విషయం కొద్ది రోజుల్లో తెరపడనుంది.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి 15రోజులు సైతం గడపకముందే గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగుస్తుండడంతో ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా మూడు రోజుల క్రితం సిబ్బంది తదితర వివరాలను సేకరించింది. డిసెంబర్ చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి మూడు దశల్లో ఎన్నికలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నది.
గత ఎన్నికలను రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు దశల్లో ఎన్నికలు జరుపగా ఈసారి నాలుగో డివిజన్గా చండూర్ రావడంతో నల్లగొండ డివిజన్తో కలిపే ఎన్నికలు జరిపేలా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు, 7,340 వార్డులు ఉన్నాయి. అయితే జిల్లాలో అదనంగా 24 గ్రామ పంచాయతీలు 163వార్డులను నూతనంగా ప్రతిపాదనలు చేశారు. వీటిపై స్పష్టత రానుంది.
వీటిని ఆమోదిస్తే జిల్లాలో గ్రామ పంచాతీయల సంఖ్య 868కి, వార్డుల సంఖ్య 7,503కు పెరగనుంది. గత ఎన్నికల్లో ప్రస్తుతం స్థానాల సంఖ్య పరంగా బీఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు ఉన్నాయి. 2024లో ఎన్నికల్లో సైతం మెజార్టీ స్థానాలు దకించుకునేలా ప్రయత్నాలు చేస్తుండగా అధికారం చేజికించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు సాదించే దిశగా పావులు కలుపుతున్నది. దీంతో గ్రామాల్లో ఎకడ చూసినా రిజర్వేషన్ల మార్పు బరిలో నిలిచే అభ్యర్థులపై చర్చ కొనసాగుతుంది.
ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ గల్లంతైన అభ్యర్థులు ఆరేండ్ల వరకు పోటీ చేయరాదనే నిబంధన ఉంది. దీంతో ఇప్పుడు మళ్లీ పోటీకి సై అంటున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. 2019లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసి డిపాజిట్ రాని వారి వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తున్నారు. ఒకవేళ మీరు పోటీ చేసేందుకు ముందుకు వస్తే డిపాజిట్ గల్లంతనే నిబంధన అడ్డు వచ్చే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుంది.
దీంతో గతంలో బలమైన అభ్యర్థులుగా రంగంలోకి దిగి అనివార్య కారణాలతోటి పోటీకి దూరమైన, ఇతర కారణాలతో డిపాజిట్ రాని వారిని పోటీలో ఉండాలనుకుంటున్న వారు మేనేజ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి తోడు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు ఎన్నికల ఖర్చులు ఇవ్వకుంటే పోటీకి అనర్హులుగా నిర్ణయించారు. దీంతో వీరు సైతం పోటీకి దూరమయ్యే అవకాశముంది.